తినడానికి ఏమీ దొరకలేదని కన్న కూతురు, పాల మినిషిని చంపేశాడు

తినడానికి ఏమీ దొరకలేదని కన్న కూతురు, పాల మినిషిని చంపేశాడు

mentally ill person kills daughter and milkman : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కిచెన్‌లో తినటానికి ఏమీ దొరకలేదన్న కోపంతో ఓ మానసిక రోగి.. కన్న కూతురు, పాల మనిషిని కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన జనూన్‌పూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనూన్‌పూర్‌, బడీ ఖాస్‌ గ్రామానికి చెందిన ముంతాజ్‌ అలియాస్‌ సోను మానసిక పరిస్థితి సరిగా లేదు.

సోమవారం అతడిని వారణాసిలోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా వాహనంలో నుంచి కిందకు దూకి పారిపోయాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. మంగళవారం ఆకలితో ఉన్న ముంతాజ్‌ వంటగదిలోకి వెళ్లి ఆహారం కోసం వెతికాడు. అక్కడ ఏమీ కనపించలేదు. దీంతో అతడు ఆగ్రహానికి లోనయ్యాడు. వంట గదిలోని కత్తి తీసుకొని హాలులోకి వచ్చి కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. మొదట కూతురు హమైరా(7)పై దాడి చేశాడు.

అనంతరం హమైరాను కాపాడటానికి వచ్చిన తన తల్లిపై కూడా దాడి చేశాడు. ఆమె అరుపులు విన్న ముంతాజ్‌ భార్య, కుమారుడితో అక్కడికి రాగా వారిపై కూడా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అడ్డుకోవటానికి వచ్చిన మరో కుటుంబసభ్యున్ని, పాలు పోయటానికి వచ్చిన పాల మనిషిపై కూడా దాడి చేశాడు.

అనంతరం అతన్ని పట్టుకున్న ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన హమైరా, పాల మనిషిని పోస్టుమార‍్టం నిమిత్తం తరలించారు. నిందితుడు ముంతాజ్‌ను అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.