NCP Chief Sharad Pawar: అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ముంబైలోని ఆస్పత్రికి తరలింపు

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోగ్యంతో సోమవారం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొందనున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యి నవంబర్ 4, 5 తేదీల్లో షిర్డీలో జరిగే పార్టీ శిబిరాల్లో శరద్ పవార్ పాల్గొంటారని ఎన్సీపీ నేత శివాజీరావు గార్జే తెలిపారు.

NCP Chief Sharad Pawar: అనారోగ్యంతో బాధపడుతున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ముంబైలోని ఆస్పత్రికి తరలింపు

NCP Chief Sharad Pawar

NCP Chief Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ ఆరోగ్యంతో సోమవారం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు. ఎన్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే ఈ మేరకు అధికారిక లేఖ ద్వారా వివరాలు వెల్లడించారు. 81 ఏళ్ల మాజీ కేంద్ర మంత్రిని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం తీసుకెళ్లడం జరిగిందని, మూడు రోజులు అడ్మిట్ అవుతారని అన్నారు. మూడు రోజుల అనంతరం డిశ్చార్జ్ అయ్యి నవంబర్ 4, 5 తేదీల్లో షిర్డీలో జరిగే పార్టీ శిబిరాల్లో శరద్ పవార్ పాల్గొంటారని అన్నారు. ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలు ఎవరూ ఆసుపత్రి వెలుపల గుమిగూడకూడదని, పవార్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, స్వల్ప అనారోగ్య సమస్యతో వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని శివాజీరావు గార్జే తెలిపారు.

2021 మార్చి నెలలో పవార్‌కు పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చేరారు. అదేనెల చివరివారంలో పిత్త వాహికలోకి జారిన పిత్తాశయ రాళ్లలో ఒకదాన్ని శస్త్రచికిత్స ద్వారా వైద్యులు తొలగించారు. ఇదిలాఉంటే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నాందేడ్ మీదుగా నవంబర్ 8న మహారాష్ట్రలోకి ప్రవేశింస్తుంది. అయితే ఈ యాత్రలో శరద్ పవార్ పాల్గొనేందుకు అంగీకరించారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు.