BHU విజిటింగ్ లెక్చలర్ గా నీతా అంబానీ..విద్యార్థుల ఆందోళన.. రిలయన్స్ క్లారిటీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీతా అంబానీ(57)ని ఉత్తరప్రదేశ్ లోని ప్రతిష్టాత్మక బనారస్ హిందూ యూనివర్శిటీ(BHU) విజిటింగ్ ఫ్యాకల్టీగా నియమించాలన్న ప్రతిపాదన క్యాంపస్లో నిరసనలకు దారి తీసింది.
Nita Ambani రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీతా అంబానీ(57)ని ఉత్తరప్రదేశ్ లోని ప్రతిష్టాత్మక బనారస్ హిందూ యూనివర్శిటీ(BHU) విజిటింగ్ ఫ్యాకల్టీగా నియమించాలన్న ప్రతిపాదన క్యాంపస్లో నిరసనలకు దారి తీసింది. యూనివర్సిటీకి చెందిన దాదాపు 40 మంది విద్యార్థులు మంగళవారం BHU వైస్ చాన్స్లర్ రాకేశ్ భట్నాగర్ నివాసం బయట నిరసిస్తూ ప్రదర్శన చేపట్టారు.
నీతా అంబానీని విజిటింగ్ ప్రొఫెసర్గా నియమించాలని వైస్ చాన్స్లర్ రాకేశ్ భట్నాగర్ ఆధ్వర్యంలో బీహెచ్యూ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ అండ్ డెవలప్మెంట్లో గత శుక్రవారం ప్రతిపాదించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. నీతా అంబానీని విజిటింగ్ ప్రొఫెసర్గా నియమించాలని అధికారులకు ప్రతిపాదన పంపినట్లుగా కోఆర్డినేటర్ నిధిశర్మ తెలిపారు. ఆమె మహిళా పారిశ్రామికవేత్త అనీ, ఫ్యాకల్టీగా చేరితో పూర్వాంచల్కు చెందిన మహిళలు తన అనుభవంతో ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఆమెకు బదులుగా మహిళా సాధికారతకు ఉదాహారణగా నిలిచిన మహిళలను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.
BHU విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఈ వ్యవహారంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. నీతా అంబానీని విజిటింగ్ ప్రొఫెసర్గా రావాలని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆహ్వానం పంపిందన్న వార్తలు నిజం కావని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనలేవీ రాలేదని, బెనరాస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని రియలన్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. నీతా అంబానీని విజింటింగ్ ప్రొఫెసర్గా నియమించినట్లు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా స్పష్టం చేసింది.