Accident: గాయపడిన మహిళను 4 కిలోమీటర్లు మోసుకెళ్లిన పోలీసులు
ఓ మహిళను రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు ఆమెను చూసి చలించిపోయారు.
Accident: ఓ మహిళను రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు ఆమెను చూసి చలించిపోయారు. ఆ ప్రాంతంలో వాహనాలు వచ్చేందుకు సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో కర్ర సాయంతో స్ర్టెచర్ తయారుచేసి భుజాలపై వేసుకొని నాలుగు కిలోమీటర్లు నడిచి అంబులెన్స్ ఎక్కించారు.
కాగా ఈ ఘటన మహారాష్ట్రలోని ఖండలా, కార్జత్ మధ్య ఉన్న పశ్చిమ కనుమల్లోని రైల్వే ట్రాక్ పై చోటుచేసుకుంది. ఓ మహిళ రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను గమనించి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారు మహిళను తీసుకెళ్లేందుకు కర్రతో స్ర్టెచర్ తయారుచేసి అందులో తీసుకెళ్లారు. ఘటన స్థలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గల పలాస్దారి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే అంబులెన్స్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పుణెకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలిని ఆశా వాఘమేర్(42)గా పోలీసులు గుర్తించారు. పశ్చిమ కనుమల్లోని ఓ కుగ్రామంలో ఆమె నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక నాలుగు కిలోమీటర్లు మహిళను తమ భుజాలపై మోసిన రైల్వే పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంశించారు.