లైంగిక వేధింపులు : చిన్మయానంద అరెస్టు
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నిర్వహించే కళాశాలలో చదివే లా విద్యార్థిని లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం అరెస్టు చేసిన సిట్ అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్లాక్ మెయిల్ చేసి తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆగస్టు 24వ తేదీన ఫేస్ బుక్లో పోస్టు చేయడం సంచలనం సృష్టించింది. వివరాలను పోలీసులకు తెలిపారు.
కానీ..పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని..తాను చనిపోతే గాని కేసులు పెట్టరా అంటూ విద్యార్థిని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారీ భద్రత నడుమ సుప్రీంకోర్టులో స్టేట్ మెంట్ నమోదు చేశారు. వేధింపుల అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ అనంతరం కేసుకు సంబంధించి సిట్ ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
సిట్ అధికారులు ఆమెను..చిన్మయానంద్ను విచారించారు. ఆరోపణలకు ఆధారాలుగా 43 వీడియోలను పెన్డ్రైవ్లో సిట్ విచారణ బృందానికి న్యాయశాస్త్ర విద్యార్థిని అందచేసింది. ఆధారాలు అందజేయడంతో తనను, కుటుంబ సభ్యులను హతమార్చుతానని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ను న్యాయ విద్యార్థిని కోరింది.
ఆరోపణలు వచ్చిన క్రమంలోనే చిన్మయానంద్ అస్వస్థతకు లోనుకావడంతో షహజన్ పూర్లోని తన ఆశ్రమంలో వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. డయేరియాతో బాధ పడుతున్నారని, ఆయనకు మధుమేహం ఉందని వైద్యులు వెల్లడించారు.
Read More : ఇక నుంచి తెలుగులోనూ గూగుల్ అసిస్టెంట్