Sopore Encounter : టాప్ కమాండర్ సహా ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ గ్రామంలో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Sopore Encounter జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ గ్రామంలో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సోపోర్ సమీపంలోని గుండ్బ్రాత్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భధ్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాల ఎదరుకాల్పుల్లో ముగ్గురు లష్కరే తొయిబా టెర్రరిస్టులు హతమయ్యారు.
ఈ ఎన్ కౌంటర్ పై సోమవారం ఉదయం కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ఓ ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ముగ్గురు లష్కరే తొయిబాకు చెందిన టెర్రరిస్టులని తెలిపారు. వారిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ ముదసిర్ పండిత్ కూడా ఉన్నారన్నారు. అతడు ముగురు పోలీసులు, ఇద్దరు కౌన్సిలర్లు, ఇద్దరు పౌరుల హత్యకేసుల్లో సహా పలు ఉగ్ర నేరాల్లో పాలుపంచుకున్నాడని తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో అతనితోపాటు మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపారు.