ఇంగ్లీష్ బాగా మాట్లాడటం, అందంగా ఉండటం సరిపోదు…సచిన్ పైలట్ పై సీఎం గహ్లోత్ సంచలన ఆరోపణలు
ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. రెబెల్ నేత సచిన్ పైలట్పై సీఎం అశోక్ గహ్లోత్ బుధవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో కలిసి రాజస్ధాన్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్రలో పైలట్ భాగస్వామిగా మారారని ఆరోపించారు.
జైపూర్లో సీఎం అశోక్ గహ్లోత్ విలేకరులతో మాట్లాడుతూ…బీజేపీతో డీలింగ్స్ లో సచిన్ పైలట్ ఇన్వాల్వ్ అయ్యారు. హార్స్ ట్రేడింగ్(ఎమ్మెల్యేల కొనుగోలు)జరిగినట్లు నా దగ్గర ప్రూఫ్ ఉంది. హార్స్ ట్రేడింగ్ జరిగినట్లు మా దగ్గర రుజువు ఉంది. డబ్బు ఆఫర్ చేయబడింది. ఏమీ జరగడం లేదని ఎవరు స్పష్టత ఇచ్చారు? కుట్రలో భాగమైన వారు స్పష్టత ఇస్తున్నారు అని సచిన్ పైలట్ ఫై గెహ్లాట్ ఫైర్ అయ్యారు
ఇంగ్లీష్ బాగా మాట్లాడటం, మీడియాకు మంచిగా అభిప్రాయాలు వెల్లడించడం, అందంగా ఉండటం ఒక్కటే సరిపోదని సచిన్ పైలట్ను ఉద్దేశించి గెహ్లాట్ వ్యాఖ్యానించారు. దేశం కోసం మీ హృదయంలో ఏముంది. సిద్ధాంతం..విధానాలు..అంకితభావం అనేవి కీలకమని హితవు పలికారు.
తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, నూతన తరాన్ని తాము స్వాగతిస్తామని, భవిష్యత్ వారిదేనని గహ్లోత్ అన్నారు. ఇప్పటి తరం నేతలు కేంద్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ చీఫ్లుగా ఎదిగారని..ఈ రకంగా వారు ఎదుగుతుంటే వారి వయసులో తాము ఒక్కో మెట్టు ఎక్కివచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.
మరోవైపు, ఉప ముఖ్యమంత్రిగా తొలగించబడిన సచిన్ పైలట్ సహా 18 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు రాజస్ధాన్ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ కోరిన మీదట స్పీకర్ ఈ నోటీసులు జారీ చేశారు. శుక్రవారం లోగా వారు నోటీసులపై బదులివ్వాలని ఆదేశించిన నేపథ్యంలో రెబెల్ నేత పైలట్పై ముఖ్యమంత్రి గహ్లోత్ తీవ్రస్ధాయిలో విమర్శలకు దిగారు.
కాగా, జైపూర్లో మంగళవారం జరిగిన రెండో దఫా కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) భేటీకి కూడా సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో పార్టీ అధిష్టానం వారిపై వేటువేసిన విషయం తెలిసిందే. పైలట్తోపాటు అతని సన్నిహితులైన ఇద్దరు మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనాలను కూడా మంత్రి పదవుల నుంచి తప్పించింది.
సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడతారా?
కాంగ్రెస్ పార్టీకి ఎదురుతిరిగిన సచిన పైలట్ తదుపరి ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పడు అందరి మదిలో మెదలుతున్నది.బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్వయంగా సచిన్ పైలట్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో కొన్నేండ్లుగా బీజేపీపై పోరాడుతున్న తాను ఆ పార్టీ చెంతన చేరలేనని చెబుతున్నారు. ఈ సమయంలో సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడతారా లేక మెత్తబడి కాంగ్రెస్ లోనే కొనసాగుతారా అన్నది వేచి చూడాలి.