నాగ పంచమి విశిష్టత

  • Published By: murthy ,Published On : July 25, 2020 / 09:20 AM IST
నాగ పంచమి విశిష్టత

ఓం సర్పరాజాయ విద్మహే
నాగరాజాయ ధీమహి
తన్నో అనంత ప్రచోదయాత్

ప్రతి ఏటా శ్రావణమాసంలో ఐదవరోజు… శుద్ధ పంచమి రోజును నాగ పంచమిగా జరుపుకుంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.”నాగులచవితి” మాదిరిగానే ”నాగ పంచమి” నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.

భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయములలో, నాగసర్పము కూడా దైవ స్వరూపమే. వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పాన్పు . వాసుకి పరమేశ్వరుడి కర్ణాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు

కశ్యప ప్రజాపతి, కద్రువ దంపతులకు , అనంతుడు ,తక్షకుడు , వాసుకి , నవనాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారట.

దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమృలై ” మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా ” అని వేడుకున్నారట .

“విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కాదా ‘ నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాడు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మణి సమేతులను తప్పించుకు తిరగండి . దేవతా విహంగ గణాలకు, జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయుభక్షకులై సాదుజీవులుగా మారండి . మీ నాగులంతా అతల, వితల పాతాళ లోకాలలో నివాసం చేయండి” అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు. దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతా పూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు.

వైదిక కాలం నుండి కూడా శ్రావణ మరియు కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది. పుట్టలో ఆవుపాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, జారవిడిచి నైవేద్యంగా సమర్పిస్తారు.

పార్వతీ దేవికి పరమేశ్వరుడు ఈ క్రింది విధముగా చెప్పినట్లుగా పురాణాలలో చెప్పడం జరిగినది.

ఓ పార్వతీ దేవి, శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగ దేవతారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల సర్ప ప్రతిమను చేయించాలి.

లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల సర్ప చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.

అందుచేత శ్రావణ మాసమున వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.

నాగ పంచమి వ్రత కథ

పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుండేది. ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవట. దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు, వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . ఆయన విని “అమ్మా ” నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందు వలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , ఇపుడు పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది. నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి.

ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని, పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాశము వారిది అని అనుకోవాలి.

మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి.. ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శారీరక పరంగా వానరం ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా సర్పం విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే సర్పాలు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి నాగసర్పాలు ఆకర్షింపబడతాయి. అలాగే వీటి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.

కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ కొంత జరుగుతుంది.

పుట్టలో పాలు ఈ క్రింది శ్లోకం చదువుతూ పోయాలి

విషాణి తస్య నశ్యంతి
నటాం హింసంతి పన్నగాః
న తేషా సర్పతో వీరభయం
భవతి కుత్ర చిత్।

ఈక్రింది శ్లోకం మననం చేసుకోని పుట్టకు ప్రదక్షిణలు చేస్తే, నాగదోషం మరియు కలిదోషం నశిస్తాయని నమ్మకం

కర్కోటకస్య నాగస్య
దమయంత్యాః నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తనం కలినాశనం।।