మెల్‌బౌర్న్ మ్యాచ్‌ జరుగుతుండగా అభిమానితో హనుమ విహారి తెలుగు సంభాషణ

మెల్‌బౌర్న్ మ్యాచ్‌ జరుగుతుండగా అభిమానితో హనుమ విహారి తెలుగు సంభాషణ

Hanuma Vihari: మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించింది టీమిండియా. ఎనిమిది వికెట్ల తేడాతో కంగారూలపై విజయకేతనం ఎగరేసింది. మ్యాచ్‌ మధ్యలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బౌండరీ లైన్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న హనుమవిహారి స్టాండ్స్‌లో నిల్చొన్న అభిమానితో తెలుగులో మాట్లాడాడు. ప్రస్తుతం వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

విహారి దగ్గరగా రావడంతో ఓ అభిమాని.. ‘తొందరగా ఔట్‌ చేయండి’ అని గట్టిగా అరిచాడు. విహారి అభిమానుల వైపు నడుస్తూ.. ‘ఔట్‌ చేస్తే మ్యాచ్ అయిపోతుందిగా’ అని ఆన్సర్ చేశాడు. ఆస్ట్రేలియాను ఆల్ అవుట్ చేస్తే.. ఆ తర్వాత భారత్‌ చేజింగ్‌కు దిగి ఈజీగా గెలిచేస్తుందని చెప్పాడు కాబోలు. మ్యాచ్‌ తొందరగా ముగుస్తుందనే ఫీలింగ్‌తో విహారీ ఇలా అభిమానితో మాట్లాడి ఉండొచ్చు. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమాని తొందరగా మ్యాచ్ ముగిసిపోవాలని ఆశించడు కదా!

కాకినాడకు చెందిన విహారి తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు. ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయినప్పటికీ ఉన్నంతసేపు ధీటుగా బౌలర్లను ఎదుర్కొని హిట్టింగ్ చేశాడు. 133/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ 200 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 70 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా‌ 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ఫలితంగా 4 టెస్టుల సిరీస్‌ను 1-1తో ఆసీస్ ఆధిక్యాన్ని సమం చేయడమే కాకుండా బాక్సింగ్ డే టెస్టు గెలవడం ప్రత్యేకం. మూడో టెస్టు జనవరి 7న సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది.