చేతులారా చేసుకున్నాం : ధోనీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం

చేతులారా చేసుకున్నాం : ధోనీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం

మ్యాచ్ ఫినిషర్.. కీలక సమయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేయగల దిట్ట మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా ఓటమికి కారణమయ్యాడని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వైజాగ్ వేదికగా ఆసీస్-భారత్‌ల మధ్య తొలి టీ20 జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించింది. అయితే తొలి పది ఓవర్లకే 3 ప్రధాన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ స్థితిలో బ్యాటింగ్‌కు ధోనీ మ్యాచ్ చివరి వరకూ వికెట్ కాపాడుకోగలిగాడే కానీ, పరుగులు చేయలేకపోయాడు. 

 

తనకు ఎంతో అచ్చొచ్చిన వైజాగ్ స్టేడియంలో 37 బంతులాడి కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. చివరి ఓవర్లో కూడా సున్నా పరుగులతో చిరాకు పెట్టించిన ధోనీ కారణంగానే ఆస్ట్రేలియా ముందు అంత స్వల్ప టార్గెట్ ఉంచామని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధోనీ క్రీజులో ఉండగా ఒక్కరు కూడా చక్కని భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. క్రీజులోకి వచ్చిన వారంతా ఒకటి, రెండు పరుగులతోనే సరిపెట్టుకోవడంతో స్కోరు నత్తనడకన సాగింది. 

ధోనీ కారణంగా పరుగులు రాకపోవడం మాట అటుంచితే, మ్యాచ్ ఆఖరి ఓవర్లో 7 బంతులకు 14పరుగులు కావల్సిన పరిస్థితి. అటువంటి కీలక సమయంలో ఉమేశ్ యాదవ్ చేతికి బంతి అప్పగించడం కోహ్లీ చేసిన తప్పు. అదే ఓవర్లో ఒక ఫోర్, ఒక సింగిల్, రెండు పరుగులు చేయడంతో మ్యాచ్ విజయాన్ని పొందగలిగింది ఆసీస్.