IND vs ENG : వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా విజయ యాత్ర.. ఇంగ్లాండ్ పై ఘన విజయం
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా విజయ జైత్రయాత్ర కొనసాగుతోంది. లక్నో వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లోనూ విజయం సాధించింది.

Team India
India vs England : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా విజయ జైత్రయాత్ర కొనసాగుతోంది. లక్నో వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్ స్టోన్ (27) ఫర్వాలేనిపించగా.. డేవిడ్ మలన్ (16), బెయిర్ స్టో (14), జోస్ బట్లర్ (10), మొయిన్ అలీ (15), క్రిస్ వోక్స్ (10) లు విఫలం అయ్యారు. జో రూట్, బెన్స్టోక్స్ లు డకౌట్లు అయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా మూడు, కుల్దీప్ యాదవ్ రెండు, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (87; 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (49; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) లు రాణించారు. కేఎల్ రాహుల్ (39; 58 బంతుల్లో 3 ఫొర్లు) ఫర్వాలేదనిపించాడు. శుభ్మన్ గిల్ (9), విరాట్ కోహ్లీ (0), శ్రేయస్ అయ్యర్ (4) లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మార్క్ వుడ్ ఓ వికెట్ సాధించాడు.
Rohit Sharma : ఎలైట్ జాబితాలో రోహిత్ శర్మ.. సచిన్, కోహ్లీ, ద్రవిడ్, గంగూలీల తరువాత..
Undefeated India go to the top of the #CWC23 points table with their sixth successive win in the tournament ?#INDvENG ?: https://t.co/YdD8G15GrY pic.twitter.com/QlONBibUxd
— ICC Cricket World Cup (@cricketworldcup) October 29, 2023
కెప్టెన్ ఇన్నింగ్స్..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆటే హైలెట్. గిల్, కోహ్లీ, శ్రేయస్ లు తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరడంతో భారత్ 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరంభంలో దూకుడుగా ఆడిన రోహిత్ ఆ తరువాత పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాడు. కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. వీరిద్దరు ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సింగిల్స్ తీస్తూ ఆడపాదడపా బౌండరీలు కొట్టారు. ఈ క్రమంలో రోహిత్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ప్రమాదకరంగా మారిన ఈ జోడిని రాహుల్ను ఔట్ చేయడం ద్వారా విల్లీ విడగొట్టాడు. రోహిత్-రాహుల్ జోడి నాలుగో వికెట్కు 91 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ తరువాత రోహిత్ గేరు మార్చాడు. ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో ఓ భారీ షాట్కు యత్నించి సెంచరీకి 13 పరుగుల దూరంలో పెవిలియన్కు చేరుకున్నాడు. అప్పటికి భారత స్కోరు 164/5. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. సూర్య సమయోచితంగా ఆడడంతో జట్టు స్కోరు రెండు వందలు దాటింది.