Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్లో ఒకే ఒక్కడు
విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
![Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్లో ఒకే ఒక్కడు Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్లో ఒకే ఒక్కడు](https://10tv.in/wp-content/uploads/2023/10/New-Project-13-3.jpg)
Kohli breaks Sachin Record
Virat Kohli-Sachin Tendulkar : వన్డే ప్రపంచకప్ 2023ని టీమ్ఇండియా విజయంతో మొదలుపెట్టింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 85 పరుగులతో రాణించాడు. దీంతో ఐసీసీ టోర్నీల్లో (వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ) అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
అంతక ముందు ఈ రికార్డు మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఐసీసీ టోర్నీల్లో సచిన్ 58 మ్యాచుల్లో 2,719 పరుగులు చేయగా.. ఇప్పటి వరకు కోహ్లీ 64 మ్యాచులు ఆడి 2,785 పరుగులు సాధించాడు. వీరిద్దరి తరువాత 2,422 పరుగులతో కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత యువరాజ్, గంగూలీలు ఉన్నారు.
ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ – 2785 పరుగులు (64 ఇన్నింగ్స్ల్లో)*
సచిన్ టెండూల్కర్ – 2,719 పరుగులు (58 ఇన్నింగ్స్ల్లో)
రోహిత్ శర్మ – 2422 పరుగులు (64 ఇన్నింగ్స్ల్లో)
యువరాజ్ సింగ్ – 1707 పరుగులు (62 ఇన్నింగ్స్ల్లో)
సౌరవ్ గంగూలీ – 1671 పరుగులు (32 ఇన్నింగ్స్ల్లో)
ODI World Cup 2023 : గెలుపు జోష్లో ఉన్న టీమ్ఇండియాకు షాక్.. రెండో మ్యాచ్కు స్టార్ ఆటగాడు దూరం
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (46; 71 బంతుల్లో 5 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (41; 52 బంతుల్లో 6 ఫోర్లు) లు రాణించారు. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. కేఎల్ రాహుల్ (97 నాటౌట్; 115 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లు), విరాట్ కోహ్లీ (85; 116 బంతుల్లో 6 ఫోర్లు) లు అద్భుతంగా ఆడడంతో 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.