Etela Resign: నేడే ఈటల రాజీనామా? అమరులకు గన్‌పార్క్‌లో నివాళి!

తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ చర్చ మొత్తం ఈటల రాజీనామాపైనే.. ఎప్పుడు రిజైన్‌ చేస్తారు? అనే సన్పెన్స్‌కు నేడు(12 జూన్ 2021) ఫుల్‌స్టాప్ పడనుంది.

Etela Resign: నేడే ఈటల రాజీనామా? అమరులకు గన్‌పార్క్‌లో నివాళి!

Etela Resign

Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ చర్చ మొత్తం ఈటల రాజీనామాపైనే.. ఎప్పుడు రిజైన్‌ చేస్తారు? అనే సన్పెన్స్‌కు నేడు(12 జూన్ 2021) ఫుల్‌స్టాప్ పడనుంది. ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేసి, బీజేపీలోకి చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకోనున్నారు ఈటల. టీఆర్ఎస్‌పై మాటల తూటాలు పేలుస్తున్న ఈటల.. హుజూరాబాద్‌లో కురుక్షేత్రమే అంటూ యుద్ధానికి సిద్ధం అంటున్నారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేముందు ఉదయం 10 గంటలకు గన్‌పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు ఈటల రాజేందర్. ఆ తర్వాత తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయంలో ఇవ్వనున్నారు. కరోనా ప్రభావం కారణంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ కార్యాలయానికి రావడం లేదు. దీంతో అసెంబ్లీ కార్యదర్శికి ఈటల రాజీనామా పత్రం అందజేసే అవకాశం ఉంది.

ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా కప్పుకోనున్నారు. అందుకోసం ఈటల, బీజేపీ నేతలతో కలిసి హైదరబాద్ నుంచి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లనున్నారు. ఆయనతో పాటు హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.

నెలరోజుల సుదీర్ఘ సమాలోచనలు, అభిప్రాయ సేకరణలు, చర్చల తర్వాత.. బీజేపీ కీలక నేతలతో మంతనాలు జరిపి.. తుది నిర్ణయం తీసుకున్నారు ఈటల. ఢిల్లీ నుంచి వచ్చి హుజూరాబాద్‌లో బలప్రదర్శన చేసిన ఈటల రాజేందర్.. టీఆర్‌ఎస్‌పై ఘాటుగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో బీజేపీలో చేరిన తర్వాత ఈటల మాటలదాడి ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తోంది.