Fake Seeds : సూర్యాపేటలో కలకలం.. రూ.13 కోట్ల విలువైన నాసిరకం విత్తనాలు స్వాధీనం
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే.. ఇలా.. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు.
Fake Seeds : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే.. ఇలా.. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. యథేచ్చగా మార్కెట్ లో నకిలీ విత్తనాలు అమ్మేస్తున్నారు. రైతులను దగా చేసి డబ్బు దండుకుంటున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో మిరప నకిలీ విత్తనాల కలకలం రేగింది.
నకిలీ విత్తనాల దందా చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లాలో దాడులు చేసి భారీ మొత్తంలో విత్తనాలను సీజ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు, లైసెన్స్ లేకుండా మిరప విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన మిర్చి నకిలీ విత్తనాల విలువ సుమారుగా రూ.13 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.
అనుమతించిన విత్తనాలు మాత్రమే అమ్మకాలు చేయాలని, స్టాక్ వివరాలు, రికార్డులు తప్పక నమోదు చేయాలని అధికారులు సూచించారు. రైతులందరూ లైసెన్స్ పొందిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. పక్క రాష్ట్రాల్లోని ప్రాంతాలకెళ్లి నకిలీ విత్తనాలు కొని మోసపోతే సంబంధిత షాపు డీలర్పై చర్యలు తీసుకోలేమని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పలు ఎరువుల దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేశారు. వ్యాపారులు నకిలీ విత్తనాలకు తావు లేకుండా స్వచ్ఛమైన, నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని సూచించారు.