Ganesh Nimajjanam Hyderabad: మహాగణపతి నిమజ్జనానికి సర్వంసిద్ధం.. ప్రత్యేక బస్సులు, మెట్రో సేవలు.. పూర్తి వివరాలు ఇలా..
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకోసం 28వ తేదీన (గురువారం) గ్రేటర్ ఆర్టీసీ 535 ప్రత్యేక బస్సులను నడపనుంది. నగరంలోని 29 ప్రాంతాల నుంచి ఇందిరా పార్క్, బషీరాబాద్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లక్డీకాపుల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Ganesh Nimajjanam: లంబోదరుడి నిమజ్జనోత్సవానికి నగరం ముస్తాబైంది. గురువారం 11వ రోజు జరగనున్న నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్సాగర్ చుట్టూ ఐదు చోట్ల 36 క్రేన్లు, పదుల కొద్దీ జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన కేంద్రాలు సిద్ధమయ్యాయి. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ ట్యాంక్బండ్తో సహా 62 చెరువులతో పాటు పీవోపీ విగ్రహాల కోసం ప్రత్యేకంగా 74 కొలనులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిమజ్జన ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
గణనాథుడి నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ఇలా..
– ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యాగణపతి నిమజ్జనాకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
– బుధవారం అర్థరాత్రి నుంచే నిమజ్జనాకి ఏర్పాట్లు మొదలవ్వనున్నాయి.
– గురువారం ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
– ఉదయం 9.30 గంటలకు ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకుంటుంది. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు స్వామివారికి పూజా కార్యక్రమం. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి విగ్రహ నిమజ్జనంతో ఉత్సవం పూర్తవుతుంది.
– గణేష్ నిమజ్జనం సందర్భంగా మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
– హుస్సేన్ సాగర్ చుట్టూ ఐదు చోట్ల 36 క్రేన్లు ఏర్పాటు చేశారు.
– మహానగరంలో మరో 100చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.
– హుస్సేన్ సాగర్తో పాటు, ఇతర నీటి కొలనుల వద్ద 200మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు.
– మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 40వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
– హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 25 వేల మందితో, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 13వేల మంది గణేశ్ నిమజ్జనోత్సవ బందోబస్తు విధుల్లో పాల్గొంటారు.
– పోలీస్ సిబ్బందితోపాటు ఆర్ఏఎఫ్, పారా మిలటరీ, అదనపు బలగాలు బందోబస్తులో పాల్గొంటాయి.
– 36గంటల పాటు పోలీసులు విధుల్లో ఉంటారు.
– బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ నుంచి నిమజ్జనాన్ని సీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు.
– 3600 సీసీ కెమెరాలను అధికారులు ఇప్పటికే అనుసంధానించారు.
– వివిధ శాఖాధికారులు సమన్వయంతో పర్యవేక్షించేలా కమాండ్ కంట్రోల్ లో ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు అందుబాటులో ఉంటాయి.
– బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
-పాతబస్తీలోని చంద్రాయణ్ గుట్ట, చార్మినార్, అప్జల్ గంజ్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్ మీదుగా హుస్సేన్ సాగర్ చేరుకోనున్న బాలాపూర్ గణేషుడు.
– 19కిలో మీటర్ల మేర బాలాపూర్ గణేష్ శోభాయాత్ర సాగుతుంది.
ఆర్టీసీ 535 ప్రత్యేక బస్సులు ..
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకోసం 28వ తేదీన (గురువారం) గ్రేటర్ ఆర్టీసీ 535 ప్రత్యేక బస్సులను నడపనుంది. నగరంలోని 29 ప్రాంతాల నుంచి ఇందిరా పార్క్, బషీరాబాద్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లక్డీకాపుల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.
అర్థరాత్రి వరకూ మెట్రో సేవలు..
గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా గురువారం అర్థరాత్రి 2గంటల వరకు మెట్రో సర్వీస్సులు నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో తెలిపింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీభవన్, నాంపల్లి మెట్రో స్టేషన్లలో ఇందుకోసం అదనపు సిబ్బందిని నియమించింది. మరోవైపు భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే ఎనిమిది ఎంఎంటీసీ రైళ్లను నడపనుంది. గురువారం రాత్రి 11 గంటల నుంచి 29న (శుక్రవారం) ఉదయం 4.40 గంటల వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయి.
మద్యం షాపులు బంద్..
వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 28న మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీలు ఉత్తర్వులు జారీ చేశారు. 28న ఉదయం 6 నుంచి 29న సాయంత్రం 6గంటల వరకు మద్యం షాపులు మూసిఉంచాలని తెలిపారు.