Secunderabad Lok Sabha Constituency : సికింద్రాబాద్ పార్లమెంట్ లో పట్టు ఉన్న కమలం.. పట్టు కోసం గులాబీ.. పట్టుదలతో హస్తం.. సికింద్రాబాద్ సికిందర్గా నిలిచేది ఎవరు ?
జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరోసారి ఆయనకే గులాబీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి... ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఆయన కూడా జూబ్లిహిల్స్ టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్లకే టికెట్లు అని కేసీఆర్ హామీ ఇవ్వడంతో.. గోపీనాథ్ ధీమాగా ఉన్నా.. తన ప్రయత్నాలు తాను చేసుకుపోతున్నారు శ్రీధర్ రెడ్డి.
Secunderabad Lok Sabha Constituency : అసెంబ్లీలన్నీ చేతిలో ఉన్నా అదొక్కటే రాలేదన్న నిరుత్సాహం ఓ పార్టీకి.. ఆ ఒక్కటి చేతిలో ఉన్నా.. అసెంబ్లీలో సత్తా చాటలేదని ఫీలింగ్ మరో పార్టీది ! సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇదీ సీన్ ! సికింద్రాబాద్ ఎంపీ సీట్ గెలిచిన బీజేపీ.. అసెంబ్లీ స్థానాల్లో జెండా ఎగురవేయలేకపోయింది. అసెంబ్లీ స్థానాలను దాదాపు క్లీన్స్వీప్ చేసిన బీఆర్ఎస్.. సికింద్రాబాద్ పార్లమెంట్ను దక్కించుకోలేకపోయింది. దీంతో లెక్కలు మార్చాలని.. పక్కా వ్యూహంతో సిద్ధం అవుతున్నాయ్ రెండు పార్టీలు ! ప్రేమగా లష్కర్ అని పిలుచుకునే సికింద్రాబాద్ను గెలిచి.. నిజమైన పండుగ పరిచయం చేయాలని పార్టీలన్నీ కసిమీద కనిపిస్తున్నాయ్. పట్టు ఉన్న కమలం.. పట్టు కోసం గులాబీ.. పట్టుదలతో హస్తం.. ఇలా అందరి టార్గెట్ ఇప్పుడు సికింద్రాబాదే ! మరి సికింద్రాబాద్ కా సికిందర్ అనిపించేంది ఎవరు.. అంతర్గత విభేధాలు పెద్దగా లేకపోయినా.. ఆ విషయం పార్టీలను భయపెడుతోందా.. సికింద్రాబాద్ ఎంపీ బరిలో నిలిచేది.. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీలో పరుగుకు సిద్ధమవుతున్న రేసుగుర్రాలు ఎవరు..
సికింద్రాబాద్ అధికారం కోసం బీజేపీ.. కారు జోరుకు బ్రేక్లేసే పనిలో కాషాయం పార్టీ
జాతీయ, రాష్ట్రాలను అనుగుణంగా తమ నిర్ణయాలు మార్చుకుంటూ.. పార్టీలకు విజయాలను మారుస్తూ… సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ జనాలు.. ప్రతీసారి తమ విభిన్నత్వాన్ని చాటుకుంటున్నారు. ఐతే ఇప్పటివరకు ఒకెత్తు.. ఇకపై ఒకెత్తు.. తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది. అధికారం కోసం బీజేపీ.. ఇక్కడ హ్యాట్రిక్ కొట్టడంతో పాటు ఢిల్లీని ఏలాలని బీఆర్ఎస్.. బౌన్స్బ్యాక్ కావాలని కాంగ్రెస్.. ఇలా అన్ని పార్టీలు.. పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయ్. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇప్పటివరకు బీఆర్ఎస్ జెండా ఎగరలేదు. దీంతో ఎలాగైనా విజయం సాధించాలని కారు పార్టీ వ్యూహాలు రచిస్తోంది. సికింద్రాబాద్ అంటే కమలానికి కంచుకోట. ఆ కోటను నిలబెట్టుకొని.. కారు జోరుకు బ్రేక్లేసే పనిలో కాషాయం పార్టీ పెద్దలు ఉన్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది.
తెలంగాణలో బీజేపీ కంచుకోటగా ఉన్న ఏకైక నియోజకవర్గం.. సికింద్రాబాద్ లోక్సభలో ఇప్పటివరకు గెలవని గులాబీపార్టీ
తెలంగాణలో ప్రేమగా లష్కర్ అని పిలుచుకునే సికింద్రాబాద్ 1957లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. తెలంగాణలో బీజేపీకి కంచుకోటగా ఉన్న ఏకైక పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి గతంలో బండారు దత్తాత్రేయ మూడుసార్లు విజయం సాధించగా… గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి విజయం సాధించారు. సికింద్రాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు నేతలు కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు. దీంతో బీజేపీ లీడర్లకు సికింద్రాబాద్ హాట్సీట్గా మారింది. ఇక్కడి నుంచి బరిలో నిలిచేందుకు ముఖ్య నేతలంతా పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కమలం పార్టీకి పట్టు ఉంది. అంబర్పేట్లో రెండుసార్లు, ముషీరాబాద్లో రెండుసార్లు, ఖైరతాబాద్లో ఒకసారి బీజేపీ విజయం సాధించింది. ఈసారి సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానంతో పాటు.. లోక్సభ పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయమే లక్ష్యంగా కాషాయం పావులు కదుపుతోంది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి గులాబీ పార్టీ ఇప్పటివరకు విజయం సాధించలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ లోటు పూడ్చాలన్న కసితో ఉంది. కాంగ్రెస్ కూడా గట్టిప్రయత్నాలే మొదలుపెట్టింది.
నియోజకవర్గంపై కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్.. పార్లమెంట్ బరిలో కిషన్ రెడ్డి..బీఆర్ఎస్ నుంచి టికెట్ రేసులో దాసోజు శ్రవణ్ పేరు
సికింద్రాబాద్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. కేంద్రమంత్రిగా ఉంటూనే.. నియోజకవర్గంపై కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పాదయాత్రలు చేస్తున్నారు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప… బీజేపీ నుంచి ఈసారి పార్లమెంట్ బరిలో కిషన్ రెడ్డినే నిలవడం దాదాపు కన్ఫార్మ్ ! కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మరోసారి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి విషయంలోనూ క్లారిటీ రావడం లేదు. కిషన్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని బరిలో దించకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని… గులాబీ పార్టీలో అభిప్రాయంఉంది. దీంతో ఈసారి బలమైన అభ్యర్థి అన్వేషణలో పడింది. సికింద్రాబాద్ పార్లమెంట్ రేసులో బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పేరు వినిపిస్తోంది. అసెంబ్లీ సీటు దక్కకపోతే.. సికింద్రాబాద్ నుంచి ఆయనకు అవకాశం ఇచ్చే చాన్స్ ఉంది. బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన రావుల శ్రీధర్ రెడ్డి కూడా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.
సికింద్రాబాద్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. ముషీరాబాద్, అంబర్పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్నగర్, నాంపల్లి, సికింద్రాబాద్.. ఈ ఏడు స్థానాల్లో మెజారిటీ బలం కారు పార్టీకే ఉంది. ఐతే పార్లమెంట్ గెలవడంలో మాత్రం గులాబీ దళం సక్సెస్ కాలేకపోయింది. ఈ ఏడు స్థానాల్లో పాగా వేయడంతో పాటు.. పార్లమెంట్ నియోజకవర్గంలో జెండా పాతాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.
ముషీరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముఠా గోపాల్… బిజేపీ తరుపున బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ టికెట్ ప్రయత్నాలు
ముషీరాబాద్లో ముఠా గోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆరోగ్యకారణాలతో ఆయన ఈసారి పోటీకి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తుండగా.. గోపాల్ కుమారుడు జైసింహ నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు లేదా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం ముందు విన్నపాలు వినిపిస్తున్నారు ముఠా గోపాల్. దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కూడా ముషీరాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయ్. అది ఆయనకు మైనస్గా మారే చాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయ్. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన లక్ష్మణ్కు.. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కింది. దీంతో ముషీరాబాద్ టికెట్ కోసం కమలం పార్టీలో భారీ పోటీ కనిపిస్తోంది. నియోజకవర్గ పరిధిలో గెలిచిన కార్పొరేటర్లంతా తమకే ఎమ్మెల్యే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి.. ముషీరాబాద్ బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా గోషామహల్ టికెట్ దక్కపోతే.. ముషీరాబాద్కు షిఫ్ట్ కావాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
అంబర్పేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాలేరు వెంకటేష్…కాలేరు వెంకటేశ్పై స్థానికంగా పార్టీలో వ్యతిరేకత
సికింద్రాబాద్ పార్లమెంట్కు అంబర్పేట్ అసెంబ్లీ హార్ట్లాంటిది. బీఆర్ఎస్ నుంచి కాలేరు వెంకటేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుత ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. రెండుసార్లు అంబర్పేట నుంచి విజయం సాధించారు. ఈసారి ఆయన అంబర్పేట బరిలో దిగే అవకాశాలు లేదు. ఐతే కిషన్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా బీజేపీ భావిస్తే మాత్రం.. ఆయన అంబర్పేట నుంచి పోటీలో నిలబడే చాన్స్ ఉంది. ఆయన పోటీలో లేకపోతే.. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతం రావ్, నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత వెంకట్ రెడ్డిలో ఒకరికి చాన్స్ రావొచ్చు. ఐతే కిషన్ రెడ్డి భార్య కావ్యా రెడ్డి.. నియోజకవర్గంలో యాక్టివ్గా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం జనాల్లో ఉంటున్నారు. కిషన్రెడ్డికి బలమైన అనుచర గణం ఉన్న నియోజకవర్గం కావడంతో.. ఇక్కడి నుంచి కావ్యారెడ్డి పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ కమలం పార్టీలో జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్పై స్థానికంగా పార్టీలో వ్యతిరేకత ఉండడంతో.. ఆయనకు మళ్లీ చాన్స్ దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో ఎడ్ల సుధాకర్ రెడ్డి.. అంబర్పేట టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న నేతలంతా తనకు మద్దతుగా నిలవడం.. సుధాకర్ రెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్లో కూడా ఈ టికెట్ కోసం భారీ పోటీ కనిపిస్తోంది. ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్కు టికెట్ దాదాపు కన్ఫార్మ్ అని ప్రచారం జరుగుతుండగా.. సీనియర్ నేత వీహెచ్ తన అనుచరులు లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్లో ఒకరికి టికెట్ ఇప్పింటే ప్రయత్నాలు చేస్తున్నారు.
READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు
సనత్నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. గోషా మహల్ మీద ఫోకస్ పెడుతున్న తలసాని
సనత్నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. మరోసారి ఆయనే బరిలో నిలవడం దాదాపు ఖాయం. ఐతే గోషామహల్ మీద తలసాని ఫోకస్ చేయడం కొత్త చర్చకు కారణం అవుతోంది. గోషామహల్ నుంచి తాను బరిలోకి దిగి.. తన కుమారుడు సాయికిరణ్ను సనత్నగర్ బరిలో దింపే ఆలోచనలో తలసాని ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు ఆకుల విజయ మధ్య ప్రధానంగా పోటీ కనిపిస్తోంది. ముషీరాబాద్లో టికెట్ దక్కపోతే.. సనత్నగర్లో అయినా బరిలో నిలవాలని బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మధ్యే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి.. అసెంబ్లీ బరిలో నిలవాలి అనుకుంటే.. ఆయనకే టికెట్ దక్కే చాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి పెద్దగా పోటీ కనిపించడం లేదు. మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ హస్తం పార్టీ తరఫున పోటీకి దిగే చాన్స్ ఉంది.
జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్..కాంగ్రెస్ నుంచి విష్ణవర్ధన్ రెడ్డి టికెట్ ఆశలు
జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నారు. మరోసారి ఆయనకే గులాబీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డి… ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. ఆయన కూడా జూబ్లిహిల్స్ టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగ్లకే టికెట్లు అని కేసీఆర్ హామీ ఇవ్వడంతో.. గోపీనాథ్ ధీమాగా ఉన్నా.. తన ప్రయత్నాలు తాను చేసుకుపోతున్నారు శ్రీధర్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి.. మరోసారి బరిలో నిలిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. విష్ణువర్ధన్ సోదరి విజయారెడ్డి ఈ మధ్యే కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. జూబ్లిహిల్స్ బరిలో నిలవాలని ఆమె భావిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ ఆశీస్సులు ఉండడం.. విజయారెడ్డికి కలిసొచ్చే అంశం. కాంగ్రెస్లో అక్కాతమ్ముళ్ల మధ్య టికెట్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ఐతే విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. అదే జరిగితే విజయారెడ్డికి లైన్ క్లియర్ అయినట్లే ! బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డితో పాటు… మాజీ ప్రధాని పీవీ మనవడు సుభాష్ కూడా టికెట్ ఆశిస్తున్నారు.
ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్…బీజేపీ నుంచి చింతల రామచంద్రరెడ్డి బరిలో దిగే చాన్స్
ఖైరతాబాద్లో దానం నాగేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి కారు పార్టీ తరఫున ఆయనకే టికెట్ దాదాపు ఖాయం. దానంను మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే.. ఉద్యమకాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న మన్నె గోవర్ధన్ రెడ్డి లేదా దాసోజు శ్రవణ్లో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉంది. పీజేఆర్ కూతురు విజయారెడ్డితో పాటు.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరూ రేవంత్ వర్గానికే చెందిన నేతలే ! రోహిన్కు ఖైరతాబాద్, విజయారెడ్డికి జూబ్లీహిల్స్ టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో రేవంత్ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయ్. ఏదైనా కారణంతో చింతల బరిలోకి దిగకపోతే… బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, పల్లపు గోవర్ధన్లో ఒకరికి టికెట్ దక్కే చాన్స్ ఉంది.
READ ALSO : Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…
సికింద్రాబాద్ లో ప్రజలకు అందుబాటులో సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు..బీజేపీ నుంచి బండ కార్తిక రెడ్డి, మేకల సారంగపాణి మధ్య పోటీ
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి డిప్యూటీ స్పీకర్ పద్మారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయనకే టికెట్ ఖాయం. సికింద్రాబాద్లో పద్మారావును ఢీకొట్టడం అంతా ఈజీ కాదు. ఎప్పుడూ జనాలకు అందుబాటులో ఉండడం.. పార్టీ శ్రేణులకు అండగా నిలవడం.. పద్మారావుకు మేజర్ ప్లస్. బీజేపీ నుంచి మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి, మేకల సారంగపాణి మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి ఆదం విజయ్ కుమార్, సంతోష్ కుమార్ పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయ్. నాంపల్లిలో ఎంఐఎం నుంచి జాఫర్ హుస్సేన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఫ్రెండ్లీ పార్టీనే అయినా.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఆనంద్ కుమార్ గౌడ్ పోటీ చేశారు. దిగాం అంటే దిగాం అన్నట్లుగా మరోసారి బీఆర్ఎస్ నాంపల్లిలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయ్. ఇన్నాళ్లు నాంపల్లి పెద్దగా ఫోకస్ పెట్టని బీజేపీ.. ఇప్పుడు రూట్ మార్చింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరుస పర్యటనలతో పార్టీ జోష్ నింపుతున్నారు. నియోజకవర్గంలో ఆయన చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన లభించింది. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా పనిచేసిన రాములును బీజేపీ తరఫున పోటీలో దింపే చాన్స్ ఉంది. కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ బరిలో దిగడం ఖాయం. ముస్లీం ప్రాబల్యం ఎక్కువగా ఉండే నాంపల్లిలో.. ఎంఐఎం మీద పైచేయి సాధించడం చాలా కష్టం.
పేరుకే సికింద్రాబాద్ పార్లమెంట్ అయినా.. హైదరాబాద్ జిల్లా అసెంబ్లీ స్థానాలే ఎక్కువ ! సికింద్రాబాద్ మీద పట్టు సాధిస్తే.. హైదరాబాద్ను గెలిచినట్లే ! అందుకే పార్లమెంట్ స్థానంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలపై మూడు పార్టీలు కన్నేశాయ్. పార్టీల్లో పెద్దగా అసంతృప్తులు కనిపించకపోయినా.. నేతల మధ్య పోరే సికింద్రాబాద్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కీలకంగా మారుతుంది. పార్టీ ఫేట్ను మార్చే అవకాశం ఉంటుంది. ఐతే ఈ మాత్రం చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వొద్దని పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయ్. దీంతో సికింద్రాబాద్ ఫైట్ రసవత్తరంగా మారింది.