Telangana : పండిన ధాన్యం కొనమంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? ధాన్యం కొనేవరకు పోరాటం ఆగదు
పండిన ధాన్యం కొనమంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? ధాన్యం కొనేవరకు పోరాటం ఆగదు అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి.
Telangana Minister niranjan reddy slams bjp Govt :తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని..తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనటంలేదు అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం నంచి తెలంగాణకు ఎటువంటి సహకారం అందటంలేదు అంటూ ఆరోపించారు. తెలంగాణ రైతుల సమస్యలకు పరిష్కారం చూపించే ఉద్ధేశ్యం కేంద్రానికి లేదు అన్నారు. కేంద్రం తెలంగాణపై ఎంత వివక్ష చూపించినా యాసంగి ధాన్యం కొనేవరకు పోరాటం కొనసాగుతుంది అని స్పష్టంచేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. బీజేపీ తెలంగాణ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన మండిపడ్డారు. తెలంగాణలో వరి సాగు చేయాలని రైతులను బీజేపీ నేతలు రెచ్చగొట్టారని ఆయన అన్నారు. మరి ఇప్పుడు ధాన్యాన్ని కొనాలని ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదని ఆయన నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి స్పష్టంలేదని విమర్శించారు.
తెలంగాణలో యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయని, బాయిల్డ్ రైస్ కొనకపోతే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని..ధాన్యాన్ని కొని కేంద్రమే మిల్లింగ్ చేసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కూడా కేంద్ర ప్రభుత్వం చేయట్లేదని ఆరోపించారు. రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించట్లేదని, మరి ఇక కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకు? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వారికోసమైనా ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే బాగుంటుందని సూచించారు.కేంద్ర మంత్రులు అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని..తెలంగాణ ప్రజలు దీన్ని సహించబోరని అన్నారు.
Also read : Paddy Issue : పీయూష్ గోయల్కు మంత్రి ఎర్రబెల్లి సవాల్
ధాన్యం కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్తే వారిని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవమానించారని నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. తెలంగాణ ప్రజలను కూడా అవహేళన చేస్తూ మాట్లాడారని..తెలంగాణలో నూకలు తినే అలవాటును పెంచామని ప్రజలను కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ అవమానించారని అన్నారు. గతంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆ సర్కారు రాష్ట్రాలను పట్టించుకోవట్లేదని బీజేపీ నేతలు అన్నారని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో యూపీఏను విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆ ప్రభుత్వ ధోరణిలో వెళ్తున్నారని విమర్శించారు. బీజేపీకి రైతుల పట్ల చిత్రశుద్ది లేదని అన్నారు.