Cassava Cultivation : వర్షాధారంగా కర్రపెండలం సాగు.. మేలైన యాజమాన్య చర్యలు

పెద్దాపురం డివిజన్ లో కర్రపెండలం దుంప లభ్యత వుండటంతో అనేక సగ్గుబియ్యం ఆధారిత పరిశ్రమలు ఇక్కడ కొలువుతీరాయి.మెట్టప్రాంతం ఎక్కువగా వుండటం, నీటి వసతి తక్కువగా వుండటంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గుచూపుతున్నారు.

Cassava Cultivation : వర్షాధారంగా కర్రపెండలం సాగు.. మేలైన యాజమాన్య చర్యలు

Cassava Cultivation

Updated On : April 28, 2023 / 12:37 PM IST

Cassava Cultivation : ఆంధ్రప్రదేశ్ లో సాగవుతున్న దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలానికి విశిష్ఠ స్థానం వుంది. ప్రధానంగా తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 22 వేల ఎకరాల్లో ఈ పంటను సాగుచేస్తున్నారు. వర్షాధారంగా జూన్, జూలై మాసాల్లోను, నీటి పారుదల కింద సంవత్సరం పొడవునా సాగుచేయవచ్చు. దుంపజాతి పంటైన కర్రపెండలాన్ని ముఖ్యంగా సగ్గుబియ్యం, గంజి పొడి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి రుచికరమైన ఆహారం కూడా.దీని దుంపలను ఉడకబెట్టి తింటారు. కర్రపెండలం నుంచి వివిధ ఉత్పత్తలను తయారీచేసే పరిశ్రమలు ఈ ప్రాంతంలో వుండటంతో వేలాది మంది రైతులు ఈ పంటసాగుతో ఉపాధిపొందుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా కర్రపెండలం సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Cassava Cultivation : కర్రపెండలం సాగుకు అనువైన రకాలు.. సాగులో మెళకువలు

వాణిజ్యసరళిలో సాగుచేసే దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలం ప్రధానమైంది. దేశవ్యాప్తంగా 5 లక్షల 70 వేల ఎకరాల్లో సాగులో వుంది. కర్రపెండలాన్ని కసావా లేదా టాపియోకా అంటారు. ఇది ఉష్ణమండలపు పంట. అధిక తేమ,  ఉష్ణోగ్రత గల వాతావరణం సాగుకు అనుకూలంగా వుంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా , ఆరుతడి పంటగా సాగుచేయవచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.

ఏజన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో వున్న ఈ పంటను, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్లో అధికంగా సాగుచేస్తున్నారు. జూన్- జూలై మాసాల్లో ఈ దుంప పంటను సాగుచేస్తారు. డిసెంబరు నుంచి మార్చిలోపు దుంప తీతకు వస్తుంది. దీని పంట కాలం, రకాన్నిబట్టి 8-10నెలలు వుంటుంది. కర్రపెండలం దుంపల్లో పీచు పధార్ధంతో పాటు, పిండి పధార్ధం ఎక్కువగా వుంటుంది.

READ ALSO : Water Management Methods : కొబ్బరి సాగులో నీటియాజమాన్య పద్దతులు!

వరి పండని ప్రాంతాల్లో, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని ప్రజలకు కర్రపెండలం ప్రధాన ఆహారం. దీని దుంపలనుంచి తయారుచేసే పౌడర్ ను  వస్త్ర పరిశ్రమలో షైనింగ్ కోసం వాడతారు. అలాగే సగ్గుబియ్యం, జిగురు తయారీ, పశువుల దాణా తయారీ పరిశ్రమల్లోను, ఇథనాల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. దుంపలు తియ్యగా వుంటాయి కనుక చిప్స్ తయారీలోను, వివిధ వంటకాల్లోను వాడుతున్నారు.

పెద్దాపురం డివిజన్ లో కర్రపెండలం దుంప లభ్యత వుండటంతో అనేక సగ్గుబియ్యం ఆధారిత పరిశ్రమలు ఇక్కడ కొలువుతీరాయి.మెట్టప్రాంతం ఎక్కువగా వుండటం, నీటి వసతి తక్కువగా వుండటంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గుచూపుతున్నారు. సంవత్సరంపాటు ఈ ఒక్క పంటే రైతులకు ఆధారం.  తేలకపాటి ఇసుక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్ర గరప నేలల్లో కర్రపెండలం దుంప వృద్ధి అధికంగా వుంటుంది. మన ప్రాంతంలో సాగుకు అనుగుణంగా హెచ్-226, హెచ్-165, శ్రీ ప్రభ, శ్రీ జయ, శ్రీ ప్రకాస్ వంటి రకాలు రైతులకు అందుబాటులో వున్నాయి.

READ ALSO : Taiwan Guava : సెమీ ఆర్గానిక్ పద్ధతిలో తైవాన్ జామ సాగు….అంతర పంటలతో నిరంతర ఆదాయం

వీటి పంటకాలం 8-10 నెలలు.  పెద్దాపురం ప్రాంతంలో రైతులు గత పంటనుంచే విత్తనాన్ని సేకరించి రెండునెలలపాటు విత్తనం భద్రపరుస్తారు. విత్తనాన్ని కొమ్మలతో ప్రవర్ధనం చేస్తారు.7-10నెలల వయసున్న బలమైన కొమ్మలను  విత్తనపు కర్రలగా ఉపయోగించాలి.  విత్తనపు కొమ్మల కొనభాగాన్ని మొదలు భాగాన్ని తొలగించి 20సెం.మీ పొడవుగల ముక్కలుగా కత్తిరిస్తారు. ఈ విత్తనపు ముచ్చెలనుంచి వేర్లు వృద్ధిచెందేందుకు 7 నుంచి 10 రోజులపాటు నారుమడిలో పెంచాల్సి వుంటుంది. ఎకరాకు 5 వేల విత్తనపు ముచ్చెలు అవసరమవుతాయి. వీటిని పెంచేందుకు 1మీటరు వెడల్పు, రెండున్నర మీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన రెండు నారుమడులు అవసరం.

నారుమడిలో నాటేముందు మాంకోజెబ్ 3గ్రాములు, డైమిథోయేట్ 2మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముచ్చెలను ముంచి నారుమడిలో పక్కపక్కనే నాటుకోవాలి. 7-10రోజుల్లో ముచ్చెలు వేర్లు తొడిగి, చిగురించటం ప్రారంభమవుతుంది. వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటే ముందు ఆఖరి దుక్కిలో ఎకరాకు 5టన్నుల పశువుల ఎరువు, 150కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, చెదల నివారణకు 20కిలోల లిండేన్ లేదా మిథైల్ పెరాథియాన్ పొడి వేసి కలియదున్నాలి. నేలను 30-35సెంటీమీటర్ల లోతుగా 3-4సార్లు దుక్కిచేయాలి.

READ ALSO : Pindinalli : దానిమ్మ, మామిడి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు నష్టం కలిగిస్తున్న పిండినల్లి! నివారణ చర్యలు

వర్షాల వల్ల భూమిలో తగినంత తేమచేరిన తర్వాత ఆరోగ్యవంతమైన వేరు, చిగురు తొడిగిన ముచ్చెలను నాటటానికి ఉపయోగించాలి. వరుసలు, మొక్కల మధ్య ఎటుచూసినా 90సెంటీమీటర్ల ఎడం వుండేటట్లుగా, 5సెంటీమీటర్ల లోతులో ముచ్చెలు నాటుకోవాలి. నాటిన వారం పది రోజుల్లో ముచ్చెలనుంచి కొమ్మలు విస్తరించటం ప్రారంభమవుతుంది. నాటిన 10-15రోజుల్లో చనిపోయిన మొక్కల స్థానంలో, 40సెంటీమీటర్ల పొడవున్న వేరు తొడిగిన ముచ్చెలను నాటాల్సి వుంటుంది.

కర్రపెండలం నాటిన 15 నుంచి 90రోజుల వరకు కలుపు లేకుండా నివారించాలి. ఈ పంటకు నత్రజని, పొటాష్ ఎరువులను పైపాటుగా అందించాలి. ఎకరాకు 24కి. నత్రజని, 24కి. పొటాష్ సరిపోతుంది. దీన్ని 3సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. ప్రతి మొక్క చుట్టూ గొప్పుచేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. 3నెలల వరకు తోటలో రసంపీల్చు పురుగులు, మచ్చ తెగుళ్ల బెడద లేకుండా జాగ్రత్త వహించాల్సి వుంటుంది.

READ ALSO : Bacterial Rot : దానిమ్మలో బాక్టీరియా తెగులు..నివారణ

ఈ పంటలో ప్రధానమైన సమస్య కసావా మొజాయిక్ వైరస్. దీనికి నివారణ లేదు కాబట్టి తెగులు సోకని తోటల నుండి నాణ్యమైన విత్తనాన్ని ఎంపికచేసుకోవాలి. వైరస్ ను వ్యాప్తిచేసే తెల్లదోమను సకాలంలో అరికట్టాలి. దోమ కనిపించిన వెంటనే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1గ్రాము లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారిచేయాలి. మొజాయిక్ వైరస్ ను సమర్థంగా తట్టుకునే శ్రీ రక్ష -1, శ్రీ రక్ష -2 రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి.

కర్ర పెండల దుంప ఊరుదల వర్షం మీద ఆధారపడి వుంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆక్టోబరు నుండి డిసెంబరు వరకు 3 నీటితడులు ఇవ్వగలితే దుంప బాగా వూరి దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఈ పంటను జూన్-జూలైలో నాటితే ఫిబ్రవరి మార్చిలో దిగుబడి వస్తుంది. ఈ సమయంలో దుంప తవ్వి సగ్గుబియ్యం ఫ్యాక్టరీలకు తరలిస్తారు.ఈ ప్రాంతంలో రైతులు కర్రపెండల దుంప ఊరుదలనుబట్టి ఎకరాకు 40-50 పుట్ల దిగుబడి సాధిస్తున్నారు. ఒక్కో పుట్టిని 225 కిలోలుగా లెక్కిస్తారు.

READ ALSO : Azolla Cultivation : పాడిపశువవులు, కోళ్లు, జీవాలకు మేతగా అజొల్లా.. అజొల్లా సాగుతో తగ్గనున్న పశుగ్రాసం ఖర్చు

ఎకరాకు 25వేల వరకు  ఖర్చపెట్టాల్సి వుంటుంది. అయితే పుట్టి ధర 1000 నుండి 1300 మధ్య మాత్రమే పలకటం వల్ల రైతుకు సరైన ఆర్థిక ఫలితాలు దక్కటం లేదు. కర్రపెండలం పంటపై ఆధారపడిన రైతులు ఏడాదిలో ఒకే పంటను తీసే అవకాశం వుండటం, సరైన గిట్టుబాటు ధర లభించకపోవటం వల్ల గతంలో 90 వేల ఎకరాలు వుండే సాగు విస్తీర్ణం ఇప్పుడు 22 వేల ఎకరాలకు పడిపోయింది. దీంతో ఈ పంట ఆధారంగా ఏర్పడిన సగ్గుబియ్యం పరిశ్రమలు గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్నాయి. పుట్టికి కనీసంగా 2వేల గిట్టుబాటు ధర లభిస్తే, దీని సాగు పూర్వవైభవం సంతరించుకునే అవకాశం వుంది. ప్రభుత్వం ఈ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.