AP Assembly Budget Session-2023: 9 రోజుల పాటు సమావేశాలు, 16న బడ్జెట్.. బీఏసీలో నిర్ణయం.. LiveUpdates
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 9 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరపాలని బీఏసీలో నిర్ణయించారు.

AP Assembly Budget Session-2023 LiveUpdates In Telugu
AP Assembly Budget Session-2023: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. పలు బిల్లులు, సవరణ బిల్లులకు ఆమోదం తెలుపుతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగుతాయి.
LIVE NEWS & UPDATES
-
16న బడ్జెట్.. బీఏసీలో నిర్ణయం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఏసీ సమావేశం నిర్వహించి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 24 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది. 16న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సభ మొత్తం 9 రోజుల పాటు జరగనుంది. ఈ నెల 19 (ఆదివారం), 22న ఉగాది సెలవులు ఉంటాయి.
-
ముగిసిన గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రేపు ఉదయం 9 గంటలకు మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభమవుతుంది.
-
టీడీపీ సభ్యుల నినాదాలు.. బాయ్ కాట్
గవర్నర్ ప్రసంగిస్తుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రభుత్వం చెప్పిస్తోన్న అసత్యాలు భరించలేకపోతున్నామని అన్నారు. పోలవరం, ఇతర ప్రాజెక్టుల ప్రస్తావన సమయంలో 'నో ఇరిగేషన్' అంటూ నినాదాలు చేశారు. అనంతరం నినాదాలు చేసుకుంటూ సభను బాయ్ కాట్ చేశారు.
-
ఆపదలో ఉన్న మహిళల వద్దకు నిమిషాల్లో పోలీసులు..
మహిళల భద్రతకు, సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కోటా, మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చామని చెప్పారు. ఆపదలో ఉన్న మహిళల వద్దకు నిమిషాల్లో పోలీసులు వస్తున్నారని తెలిపారు.
-
కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు: గవర్నర్
సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరుగుతోందని, అర్హులకు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతుందని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చెప్పారు. కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు జరుతోందని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లామని తెలిపారు.
-
విద్యారంగంలో సంస్కరణలు: గవర్నర్
మనబడి- నాడునేడు ద్వారా తొలి దశలో రూ.3,669 కోట్లతో ఆధునికీకరణ చేపట్టామని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. విద్యారంగంలో సంస్కరణలు చేపట్టామని అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో ప్రగతి సాధిస్తున్నామని చెప్పారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం బోధన అందిస్తున్నామని తెలిపారు. ద్విభాషా పుస్తకాలు, ఇంగ్లిష్ ల్యాబ్ ల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశామని తెలిపారు. కడపలో డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని అన్నారు. అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు.
-
ఆర్థికాభివృద్ధిలో ముందంజలో ఉన్నాం: గవర్నర్
వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు అనూహ్య ప్రగతిని సాధిస్తున్నాయని గవర్నర్ అన్నారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందని తెలిపారు. 11.43 వృద్ధి రేటును సాధించామని చెప్పారు.
-
గవర్నర్ ప్రసంగం..
AP Assembly Budget Session-2023
నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందని గవర్నర్ అన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందుతోందని తెలిపారు.
-
సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
-
అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్, సీఎం
అసెంబ్లీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ చేరుకున్నారు.
-
భారీ భద్రత
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, దాదాపు 15 సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని టీడీపీ భావిస్తోంది.
-
17న వార్షిక బడ్జెట్?
అసెంబ్లీలో మార్చి 15,16 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ నెల 17న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లేదంటే ఈ నెల 18న బడ్జెట్ ప్రవేశపెడతారు.