Amaravati Farmers Padayatra : రాజధాని రైతుల పాదయాత్రకు ఏపీ బీజేపీ మద్దతు

మొత్తానికి.. ఏపీ బీజేపీ రూటు మార్చింది. అమిత్ షా ఆదేశాలతో.. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపింది.

Amaravati Farmers Padayatra : రాజధాని రైతుల పాదయాత్రకు ఏపీ బీజేపీ మద్దతు

Ap Bjp Leaders In Raithula Padayatra

Updated On : November 22, 2021 / 8:52 AM IST

Amaravati Farmers Padayatra :  మొత్తానికి.. ఏపీ బీజేపీ రూటు మార్చింది. అమిత్ షా ఆదేశాలతో.. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపింది. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని పేరుతో.. రైతులు చేస్తున్న పాదయాత్రకు.. బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. రాజధానిని.. 3 ముక్కలు చేయడం తప్పంటున్నారు. కమలనాథుల నిర్ణయంతో.. ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా.. అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమానికి.. మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే.. వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపాయి. ఇప్పుడు.. ఏపీ బీజేపీ కూడా రైతుల మహా పాదయాత్రకు మద్దతు తెలిపింది. నిన్న మొన్నటి వరకు ప్రకటనలకే పరిమితమైన బీజేపీ నేతలు.. ఇప్పుడు ప్రత్యక్షంగా రైతులతో కలిసి నెల్లూరులో పాదయాత్ర చేశారు.

Also Read : AP Floods : వరద ప్రభావిత జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరికి.. నెల్లూరులో బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అమరావతినే.. రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు.. తాము మొదటి నుంచి మద్దతునిస్తూ.. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నామని.. బీజేపీ నేతలు తెలిపారు. ఇందుకు.. అనంతపురం నుంచి అమరావతి వరకు.. కేంద్రం ఎక్స్‌ప్రెస్ వేను మంజూరు చేయడమే నిదర్శనమన్నారు.

రాజధాని విషయం కోర్టులో ఉండటంతో.. కంటెప్ట్ ఆఫ్ కోర్టుగా మారుతుంది కాబట్టి.. ఇన్నాళ్లూ తాము బహిరంగంగా బయటకు చెప్పలేకపోయామన్నారు బీజేపీ నేతలు. కానీ.. రైతులు చేస్తున్న పాదయాత్రలో.. లాఠీచార్జ్ ఘటనలు చోటు చేసుకోవడంతో.. మద్దతు తెలిపేందుకు ముందుకొచ్చామన్నారు.