Ys Sharmila : ఇది ప్రతీకారమే..! నాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారు- వైఎస్ షర్మిల
ఇలా చేయడం కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని వాపోయారు.

YS Sharmila, Chandrababu Naidu
Ys Sharmila : ఏపీ సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తీసేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. YSR అంటే ఎందుకింత కక్ష అని సీఎం చంద్రబాబును నిలదీశారు.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అని ఆమె విమర్శించారు. నాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారని షర్మిల అన్నారు. అధికారంలో ఉండగా NTR పేరు మార్చి అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత వైఎస్ఆర్ పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటుందని వ్యాఖ్యానించారు.
ఇలా చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని వాపోయారు. YSR జిల్లాను తిరిగి YSR కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేకపోయినా.. కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తీసేయడాన్ని ఖండిస్తున్నామన్నారు షర్మిల. YSR అంటే ఎందుకింత కక్ష అని అడిగారు.
Also Read : వర్మ నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటారా? పదవుల రేసులో ఉన్న ఈ నేతలకు తీపికబురు ఎప్పుడు?
”YSR జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు.. విజయవాడ కేంద్రంగా ఉన్న NTR జిల్లాకు NTR విజయవాడ అనో లేక.. పాత కృష్ణా జిల్లాకు NTR కృష్ణా జిల్లాగా పేరు ఎందుకు మార్చలేదని ప్రశ్నిస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేత.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి @ncbn తీరు. అనాడు జగన్ గారు చేసిన తప్పే నేడు చంద్రబాబు గారు చేస్తున్నారు. అధికారంలో ఉండగా స్వర్గీయ NTR పేరు మార్చి YCP @YSRCParty ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత YSR…
— YS Sharmila (@realyssharmila) March 18, 2025
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు లాంటి ప్రజాకర్షక పథకాలకు రూపశిల్పి మహానేత YSR. తెలుగు వారు తమ గుండెల్లో గుడి కట్టుకొని, ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన వైఎస్సార్ ఫోటో పెట్టుకొని పూజిస్తున్న గొప్ప నేతకు రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదు. ఇది ఆయనకు ఇచ్చే గౌరవం అంతకన్నా కాదు. YSR అనే పేరు ప్రజల ఆస్తి. ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు. YSR తెలుగు వారి సొత్తు” అని షర్మిల స్పష్టం చేశారు.