ఏపీ తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. జిల్లాల వారీగా వివరాలు
Panchayat Election Results : ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరింది. ఇప్పటికే చాలా చోట్ల ఫలితాలు వెలువడగా.. మిగిలిన చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పార్టీ రహితంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మద్దతుదారుల అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు.
పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి మద్దతుదారులు అంతగా ప్రభావం చూపలేదు. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప.. కౌంటింగ్ ప్రశాంతంగానే సాగుతోంది. చిన్న గ్రామ పంచాయతీల్లోని కొన్నింటిలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకే ఫలితాలు వెల్లడయ్యాయ్.
పంచాయతీ ఎన్నికల ఫలితాలతో.. మెజార్టీ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందడంతో సంబురాలు చేసుకున్నారు ఆ పార్టీ నేతలు. ఫస్ట్ ఫేజ్ ఫలితాలు రావడంతో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద సెలబ్రేషన్స్ భారీఎత్తున జరిగాయి. మొత్తం సీట్లలో 90 శాతానికి పైగా గెలిచామంటున్నాయి వైసీపీ శ్రేణులు. వైసీపీ ఆఫీస్ వద్ద బాణసంచా, బ్యాండ్బాజాతో సందడి చేశాయి.
వైసీపీ నేతలు మాత్రమే కాక.. తమ పార్టీ మద్దతుదారులు కూడా చాలా చోట్ల విజయం సాధించారని కూడా సంబరాలు చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. పార్టీలవారిగా ఎలా ఉన్నా.. తొలి దశ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందిన అభ్యర్థులు మాత్రం సంబరాల్లో మునిగిపోయారు.
ప్రకాశం జిల్లా (227): వైసీపీ 162, టీడీపీ 60, ఇతరులు 4, సీపీఐ 1
విశాఖ జిల్లా (340) : వైసీపీ 254, టీడీపీ 56, ఇతరులు 29, బీజేపీ-జనసేన 1
నెల్లూరు జిల్లా (163) : ఏకగ్రీవం 25, వైసీపీ 80, టీడీపీ 26, ఇతరులు 18, బీజేపీ 1
కడప జిల్లా (206) : వైసీపీ 177, టీడీపీ 25, ఇతరులు 2
అనంతపురం జిల్లా (169) : ఏకగ్రీవం 6, వైసీపీ 134, టీడీపీ 23, ఇతరులు 6
చిత్తూరు జిల్లా (454) : ఏకగ్రీవం 112, వైసీపీ 264, టీడీపీ 70, బీజేపీ 1, జనసేన 1, కాంగ్రెస్ 1, ఇతరులు 5
శ్రీకాకుళం జిల్లా (321) : ఏకగ్రీవం 39, వైసీపీ 222, టీడీపీ 57, ఇతరులు 2
కృష్ణా జిల్లా (234): ఏకగ్రీవం 23, వైసీపీ 132, టీడీపీ 28, ఇతరులు 4, జనసేన 1
గుంటూరు జిల్లా (337) : ఏకగ్రీవం 67, వైసీపీ 241, టీడీపీ 73, జనసేన 12, ఇతరులు 11