గుడ్ న్యూస్, ఇసుక విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఇసుక మరింత సులభంగా, చౌకగా లభించనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. శుక్రవారం(జూలై 17,2020) నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.
ట్రాక్టర్కు రూ.1,300 భారం తగ్గింది:
రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిబందనలు అమల్లోకి వచ్చాయి. ఇంతవరకు ట్రాక్టర్ ఇసుకకు చలానాగా రూ.1,300లు, లోడింగ్ చార్జీలు రూ.800లు, రవాణా చార్జీ రూ.1,000 నుంచి రూ.1,500లు కలుపుకొని మొత్తం రూ.3,500 నుంచి రూ.4,000 వరకు వసూలు చేసేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్కు రూ.1,300 భారం తగ్గనుంది. ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని వర్గాల అవసరాలకూ ఇసుక ఉచితంగా అందివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఎంతోమందికి మేలు కలగనుంది.
ఇసుక కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాలి:
* ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇసుక కోసం వినియోగదారుడు గ్రామ సచివాలయంలో తన అడ్రస్తో అనెక్సర్-1లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఈ అర్జీని 24 గంటల్లో పరిశీలించి అనెక్సర్–2లో పర్మిట్ ఇస్తారు.
* రీచ్ నుంచి 20 కిమీ పరిధిలో మాత్రమే అనుమతి.
* రవాణా చేసుకునే సమయంలో సచివాలయం ఇచ్చిన పర్మిట్ కచ్చితంగా ఉండాలి.
* నోటిఫై చేసిన రీచ్ల నుంచి మాత్రమే ఇసుక తరలించాల్సి ఉంటుంది.
* ఇసుక పక్కదారి పట్టకుండా చూసే బాధ్యత గ్రామ కార్యదర్శిది.
* ఒక వేళ 1 నుంచి 3 స్ట్రీమ్స్లో ఇసుక లభ్యత లేకుంటే జిల్లా కలెక్టర్ 4, 5 స్ట్రీమ్స్ నుంచి ఇసుక తెప్పించి స్టాక్ యార్డుల ద్వారా సరఫరా చేస్తారు.
పేదల కోసం ఆదాయాన్ని వదులుకున్న ప్రభుత్వం:
ప్రస్తుతం పలు రీచ్లలో ట్రాక్టర్ లోడింగ్కు రూ. 800 నుంచి 1000లు వసూలు చేస్తున్నారు. గతంలో లోడింగ్ చార్జీలు రూ.400లే ఉండేది. క్రమంగా ఇసుకకు డిమాండ్ పెరగటంతో లోడింగ్ చార్జీలు కూడా పెంచేశారు. దీని భారం వినియోగదారులపై పడుతోంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం లోడింగ్కు టన్నుకు రూ.90లు చొప్పున ట్రాక్టర్ (4.5టన్నులు)కు రూ.405లు తీసుకోవాలి. అయితే లోడింగ్ చార్జీలపై నియంత్రణ లేక పోవటంతో ఇసుక ధర తగ్గటం లేదు. ఇదే తీరుగా వినియోగదారుల అవసరాలను ట్రాక్టర్ యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. పేదల అవసరాలు తీర్చటం కోసం ఆదాయాన్ని వదులుకున్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే లోడింగ్, ట్రాన్స్పోర్టు చార్జీలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్కు రూ.1300లు భారం తగ్గింది. ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆశయం. తాజా ఆదేశాలతో రీచ్ల నుంచి ఎక్కడైనా నిబంధనలకు లోబడి ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు.