ఏపీలో మరో కీలక నేత అరెస్ట్‌కు రంగం సిద్ధం? వైసీపీ నేతల హెచ్చరిక ఇదేనా?

  • Published By: srihari ,Published On : June 25, 2020 / 03:32 PM IST
ఏపీలో మరో కీలక నేత అరెస్ట్‌కు రంగం సిద్ధం? వైసీపీ నేతల హెచ్చరిక ఇదేనా?

Updated On : June 25, 2020 / 3:32 PM IST

ఏపీలో మరో అరెస్టుకు రంగం సిద్ధం అయిందా? ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో నేతను టార్గెట్ చేసిందా? గత ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా ఉన్న నేతను అరెస్ట్ చేయనుందా? టీడీపీలోని కీలక నేతలకు వైసీపీ నేతలు చేసిన హెచ్చరిక ఏంటి అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏపీలో ఇప్పుడు అరెస్టుల కాలం నడుస్తోంది. గత ప్రభుత్వంలో ఉండి అక్రమాలకు పాల్పడ్డరంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నా నేతలపై వైసీపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఒక్కొక్కరి అక్రమలా చిట్టాను విప్పుతోంది. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. ఇక మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. మాజీ మంత్రులు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పపైనా కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది.

టీడీపీ నేతలను వరుసగా అరెస్ట్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈసారి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ను టార్గెట్ చేసినట్టుగా సమాచారం. సోషల్ మీడియా కేసులో గంటా పాత్ర ఉందనే  ఉదంతాలు ప్రభుత్వానికి లభిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో తర్వాతి అరెస్ట్ గంటాదేనన్న ప్రచారం జరుగుతోంది. విశాఖలో నలంద కిశోర్ అరెస్ట్ టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ నలంద కిశోర్ ను సీఐడీ అరెస్ట్ చేసింది. 

నలంద కిశోర్ గంటా శ్రీనివాస్‌ రావుకు అనుచరుడు, మంచి మిత్రుడు కూడా. నలంద కిశోర్ అరెస్టును గంటా శ్రీనివాస్ రావు తీవ్రంగా ఖండించారు. కేవలం తనను రాజకీయంగా వేధించడానికే తన మిత్రులపై కేసులు పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినవారిని వదిలేసి వాటిని ఫార్వాడ్ చేసినవారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కేవలం తనను పొలిటికల్ గా టార్గెట్ చేసుకుని మిత్రుడైనా కిశోర్ పై అక్రమంగా కేసు పెట్టారని గంటా ఆరోపించారు. దీన్ని రాజకీయంగా ఎదుర్కొంటానని గంటా స్పష్టం చేశారు.   

గంటా వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి స్పందించారు. ఈ కేసు ఇక్కడితో ఆగదని, గంట ఇంట్లో వ్యక్తుల పేర్లు, ఆయన ఇతర అనుచరులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. చట్టం తప్పు చేసిన ఎవరిని వదలదని హెచ్చరించారు. మహిళలపై నీచమైన రాతలు రాయడమేంటి అని ప్రశ్నించారు. సీఐడీ అధికారుల దగ్గర పూర్తి వివరాలు ఉన్నందునే నలంద కిశోర్ ను అరెస్టు చేశారని అన్నారు. ఈ కేసు వెనుక ఎవరూ ఉన్నా శిక్ష తప్పదని అవంతి శ్రీనివాస్ చెప్పారు. 

ప్రభుత్వంలోని పెద్దలు మరికొన్ని అరెస్టులు జరుగుతాయని చెబుతుండటంతో గంటా అరెస్టు కూడా కచ్చితమేనన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు పెట్టడంతో కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు పెట్టారు. దీంతో తర్వాత అరెస్ట్ గంటా శ్రీనివాసరావు అనే ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని అంటున్నారు.