APS RTC Charges : ఏపీలో మరో బాదుడు.. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు.. రేపటినుంచే అమల్లోకి..!
APS RTC Charges Hike : ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ సెస్ విధించారు.
APS RTC Charges Hike : ఏపీలో నిత్యావసర ధరలు మండుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరిగాయి. నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలతో సతమతమవుతున్న రాష్ట్రప్రజలకు మరో షాక్ ఇచ్చింది ప్రభుత్వం.. ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రయాణికులపై డీజిల్ సెస్ విధించారు. డీజిల్ రేట్లు పెరగడంతో బస్సు ఛార్జీలు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తోందని ఆర్టీసీ ఎండీ ద్వారాకా తిరుమల వెల్లడించారు.
ఏపీ ఆర్టీసీ కొత్త రేట్ల ప్రకారం.. పల్లె వెలుగు బస్సుకు రూ. 2, ఎక్స్ ప్రెస్ బస్పై రూ. 5, ఏసీ బస్సుకు రూ. 10 పెంచుతున్నట్టు ప్రకటించారు. పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో కనీస ఛార్జీలు రూ. 10కు పెంచారు. పెరిగిన డీజిల్ సెస్ ధరలు గురువారం (ఏప్రిల్ 14) నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోనూ ఆర్టీసీ ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. తెలంగాణ బాటలోనే ఏపీఎస్ ఆర్టీసీ కూడా ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి వచ్చిందని ఎండీ ద్వారాకా తిరుమల అన్నారు.
సామాన్యులపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నామని తెలిపారు. పల్లె వెలుగు బస్సుల్లో రూ. 2 మాత్రమే పెంచుతున్నామని చెప్పారు. డీజిల్ సెస్ కారణంగా ఏడాదికి రూ. 720 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ నష్టాల్లో నుంచి బయటపడాలంటే.. బస్సు టిక్కెట్లపై 32 శాతం ఛార్జీలు పెంచాల్సి వస్తుందన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లలో రూ.5,680 కోట్లు నష్టం వచ్చిందని వెల్లడించారు.