Bharat Bandh : కొనసాగుతున్న భారత్ బంద్, ఏపీలో బంద్ ప్రశాంతం
దేశవ్యాప్తంగా.. భారత్ బంద్ మొదలైంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అటు రైతు సంఘాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటు కార్మిక సంఘాలు.. భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
farmers protest : దేశవ్యాప్తంగా.. భారత్ బంద్ మొదలైంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అటు రైతు సంఘాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటు కార్మిక సంఘాలు.. భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఉద్యమం చేపట్టి నేటికి 4 నెలలు పూర్తయింది. ఇప్పటికి కూడా ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతుల ఆందోళన 120 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా భారత్ బంద్ చేపట్టాలని నిర్ణయించింది. 2021, మార్చి 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు బంద్ పాటించనున్నారు అన్నదాతలు.
ఈ భారత్ బంద్కు కాంగ్రెస్, వామపక్షాలు తదితర ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఈసారి భారత్ బంద్ సంపూర్ణంగా ఉంటుందని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.. అయితే ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతాన్ని బంద్ నుంచి మినహాయింపునిచ్చినట్లు తెలుస్తోంది. రోడ్డు, రైలు మార్గాలపై బంద్ ప్రభావం చూపనుంది. అత్యవసర సర్వీసులు మెడికల్ స్టోర్, పెట్రోల్ పంప్లు తప్ప ఇతర సేవలపై బంద్ ప్రభావం ఉంటుందన్నారు రైతు సంఘాల నేతలు.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు.. అయితే రైతులు, కార్మికులు చేసే ఆందోళనకు అటు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు మద్ధతు ప్రకటించాయి. దీంతో ఏపీలో బంద్ ప్రభావం కనబడుతోంది. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చిన బంద్కు సంఘీభావం తెలుపుతున్నామన్నారు మంత్రి పేర్ని నాని. ఏపీలో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు నడపమని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం బంద్కు సంఘీభావం తెలపడంతో.. ఏపీలో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.