విశాఖ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్, నలుగురు ఎమ్మెల్యేలలో మిగిలింది ఒక్కరే

విశాఖ జిల్లా టీడీపీలో కలకలం రేగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీకి దగ్గరయ్యారు. గన్నవరం, చీరాల ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం తరహాలోనే పార్టీలో చేరకుండా మద్దతు ప్రకటిస్తున్నారు. గత కొంత కాలంగా సైలెంట్గా ఉంటున్న వాసుపల్లి.. టీడీపీ అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారట. ఇప్పటికే మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అలాగే మరో ఎమ్మెల్యే గణబాబు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. వీరంతా కూడా వైసీపీలో చేరడానికి సిద్ధమేనని అంటున్నారు.
వైసీపీకి అనుకూలంగా గంటా, గణబాబు, వాసుపల్లి:
నగర పరిధిలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలుండగా.. ముగ్గురు ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తొలి రోజుల్లో కొంత యాక్టివ్గా ఉన్నప్పటికీ.. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. గంటా శ్రీనివాసరావు, గణబాబు, వాసుపల్లి గణేశ్ వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇక మిగిలిన ఒక్క ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాత్రం టీడీపీతోనే ఉంటారని చెబుతున్నారు.
ఆ లేఖతో వాసుపల్లి బాగా హర్ట్ అయ్యారు:
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేరికను వైసీపీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తుండడంతో జాప్యం జరుగుతోందని అంటున్నారు. వాసుపల్లి విషయంలోనూ అదే పరిస్థితి ఉన్నా ఆయన బయట నుంచే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించడం తుగ్లక్ చర్యగా అభివర్ణిస్తూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ పేరుతో రాసిన లేఖ గతంలో వైరల్ అయ్యింది. అయితే ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా ఆ లేఖను తెలుగుదేశం అధిష్టానం విడుదల చేసిందనే విషయం తెలియడంతో వాసుపల్లి బాగా హర్ట్ అయ్యారట. అంతకు ముందు నుంచే సైలెంట్గా ఉంటున్న ఆయనకు ఆ లేఖ ఒక అవకాశంగా దొరికిందంటున్నారు.
క్యూలో గంటా, గణబాబు:
వాసుపల్లి గణేశ్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖరారు కావడంతో ఇంకా ఎవరెవరు పార్టీ మారతారనే విషయమై టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది. గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పుపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా అడుగు ముందుకు పడడం లేదు. ఆయన వైసీపీలోకి వెళ్లాలని భావిస్తున్నా… అక్కడ నుంచి మాత్రం అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా మంత్రి అవంతి శ్రీనివాస్ వర్గం గంటా రాకను వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో గణబాబు కూడా పార్టీ మారతారనే ప్రచారం మొదలైంది. కానీ, ఎందుకో పెండింగ్లో పడింది. వీరిద్దరి విషయం పెండింగ్లో ఉండగానే ఇప్పుడు సడన్గా వాసుపల్లి తెర మీదకు రావడం చర్చనీయాంశం అయ్యింది.