Thirumala : తిరుమలలో మూడు రోజులపాటు బ్రేక్ దర్శనాలు రద్దు
వైకుంఠ ఏకాదశి, గరుడ సువ రోజులకన్నా భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఒక్కసారిగా భక్తులు పెరిగిపోవడంతో టీటీడీ సైతం ఉక్కిరిబిక్కిరయింది. మూడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
Thirumala : తిరుమల కొండ కిక్కిరిసింది. ఓ వైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు వీకెండ్ కావడంతో తిరుమల భక్తజన సంద్రమైంది. భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పండుతోంది. ప్రతిగంటకు 8వేల మంది భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశిస్తున్నారు. అయితే గంటకు 4 వేల మందికి మాత్రమే వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కలుగుతుంది. అంతుకు మించి భక్తులకు దర్శనం కల్పించలేమని టీటీడీ తెలిపింది.
వైకుంఠ ఏకాదశి, గరుడ సువ రోజులకన్నా భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఒక్కసారిగా భక్తులు పెరిగిపోవడంతో టీటీడీ సైతం ఉక్కిరిబిక్కిరయింది. మూడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరో నాలుగు రోజుల పాటు రద్దీ ఉంటుందని.. భక్తులు తిరుమలకు రావొద్దని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సూచించారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. బ్రేక్ దర్శనాలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది.
మరోవైపు క్యూలైన్లలో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట లాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. క్యూలైన్లను పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి.. వైకుంఠం కాంప్లెక్స్ వెలుపల ఉన్నవారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.