Buddha Venkanna : అందుకే వివేకాను హత్య చేశారు.. బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు
వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల చెప్పినవి వాస్తవాలు అన్నారు. సాక్ష్యం చెప్పిన షర్మిలకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం షర్మిలకు వై కేటగిరి భద్రత కల్పించాలని కోరారు.
![Buddha Venkanna : అందుకే వివేకాను హత్య చేశారు.. బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు Buddha Venkanna : అందుకే వివేకాను హత్య చేశారు.. బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు](https://10tv.in/wp-content/uploads/2023/07/Buddha-Venkanna.jpg)
Buddha Venkanna
Buddha Venkanna – YS Viveka Case : ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో జగన్ సూత్రధారి.. అవినాశ్ పాత్రధారి అని ఆరోపించారు. వివేకా హత్య విషయమై ఇంకా లోతైన దర్యాప్తు జరగాలన్నారు. జగన్ గురించే కాదు.. జగన్ వెనుక ఎవరున్నారో కూడా తేలాలని పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వకూడదని జగన్ అనుకున్నారని పేర్కొన్నారు. షర్మిలకు ఎంపీ సీటు కోసం వివేకా పట్టుబట్టారని తెలిపారు. వివేకా అడ్డుగా ఉన్నారని ఆయన్ను హత్య చేశారని ఆరోపించారు. లోటస్ పాండ్ లోనే వివేకా మర్డర్ స్కెచ్ వేశారని విమర్శించారు.
వివేకా హత్య విషయం తెలిసిన వెంటనే జగన్ పులివెందులకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. పులివెందులకు వెళ్లాక జగన్ నేరుగా వివేకా మృతదేహం వద్దకు వెళ్లకుండా ఇంటికి ఎందుకెళ్లారని నిలదీశారు. హత్య విషయం ఉదయం తెలిస్తే సాయంత్రం ఐదు గంటలకు వెళ్లడం ఏంటని అడిగారు.
వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల చెప్పినవి వాస్తవాలు అన్నారు. సాక్ష్యం చెప్పిన షర్మిలకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం షర్మిలకు వై కేటగిరి భద్రత కల్పించాలని కోరారు. సునీతా రెడ్డిని ఉక్కు మహిళగా అభివర్ణించారు. ఓ సైకో సీఎంపై పోరాడడం మామూలు విషయం కాదన్నారు.
వైఎస్ వివేకా హత్య వల్ల ఆ కుటుంబం ఎంత నష్టపోయిందో.. రాష్ట్ర ప్రజలు అంతే నష్టపోయారని పేర్కొన్నారు. వివేకా హత్య తర్వాత టీడీపీపై ఆరోపణలు చేసి సానుభూతితో ఓట్లేయించుకుని జగన్ గెలిచారని విమర్శించారు. జగన్ గెలవడం వల్లే ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.