Chandrababu : అమ్మఒడిపై నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే కదా జగన్ రెడ్డీ : చంద్రబాబు కౌంటర్ ట్వీట్
పాఠశాలల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. 'విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ...విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు' అని ఎద్దేవా చేశారు.

Chandrababu tweet Jagan
Chandrababu Counter Tweet Jagan : అమ్మఒడి పథకంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నలతో కౌంటర్ ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు మాటలు…నేటి కోతలపై జగన్ ను నిలదీస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘అమ్మఒడిపై నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే కదా జగన్ రెడ్డీ!, రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్ధిదారులు 83 లక్షల మంది పైగా ఉంటే… మీరు ఇచ్చేది ఎంతమందికి? అని ప్రశ్నించారు.
ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పింది వాస్తవం కాదా? ఇద్దరు బిడ్డలు ఉంటే…ఒక్కరికే పథకం ఇవ్వడం వివక్ష కాదా అని నిలదీశారు. ఇప్పుడు ఇస్తున్నది ఎంత…దాంట్లో కోస్తున్నది ఎంత అని ప్రశ్నించారు.
300 యూనిట్ల కరెంట్ వాడారని, 75 శాతం హాజరు లేదని.. ఇంట్లో వారికి కారు(జీవనోపాధిగా ఉండే టాక్సీ) ఉందని.. ఇలా సవాలక్ష కొర్రీలతో కోతలు పెడుతున్నది నిజం కాదా కోతల రాయుడూ? అని అడిగారు. పాఠశాలల నిర్వహణ పేరుతో పథకానికి కోతలు పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ‘విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ…విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు’ అని ఎద్దేవా చేశారు.
‘అమ్మఒడి అంటూ నాన్న బుడ్డితో మీరు చేసే దోపిడీకి సమాధానం చెప్పగలరా’ అంటూ జగన్ ను చంద్రబాబు నిలదీశారు. విద్యతోనే బతుకు మారుతుందని బలంగా నమ్మే తాము అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం పేరుతో ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తామంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.