3 రాజధానుల ప్లాన్ ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు.. అటువంటిది ఏపీలో తీసుకొచ్చారు: చంద్రబాబు
"సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తానంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి, సంక్షేమం, సాధికారత అన్ని జరగాలి" అని అన్నారు.

ఒకే ఒక్క పార్టీ అధికారంలో ఉన్నా సాధారణంగా ఆ పార్టీలో విభేదాలు వస్తుంటాయని, ఏపీలో మాత్రం మూడు పార్టీలు అధికారంలో ఉన్నా ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకు పవన్ కల్యాణ్, పురందేశ్వరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ప్రజల కోసం అందరం పునరంకితం అవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా వెలగపూడి సచివాలయం వెనుకభాగంలో ఏపీ సర్కారు సభ నిర్వహించింది. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహిస్తున్న ఈ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
Also Read: వీటన్నింటి మధ్య ఏపీ అప్పుడు విలవిలలాడిపోయింది: ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో పవన్ కల్యాణ్
మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అటువంటిది ఏపీలో ఇటువంటిది తీసుకొచ్చారు. పోలవరం పూర్తయితే ఏపీకి నీటి సమస్య పరిష్కారం అయ్యేది. సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తానంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి, సంక్షేమం, సాధికారత అన్ని జరగాలి” అని అన్నారు.
“”ఎన్నికల్లో ఓట్లు చీలడానికి వీల్లేదని సంకల్పించాం. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతామని చెప్పాం. ఈ ఏడాది వేసింది తొలి అడుగు మాత్రమే. ఏదో అన్ని చేశామని చెప్పడం లేదు. కానీ ఊహించిన దాని కంటే ఎక్కువ చేశాం. నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యాను. క్లిష్టమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని అయ్యాను. ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.
ప్రధాని మోదీ వికసిత్ భారత్-2047ను ప్రకటించారు. మనం కూడా స్వర్ణాంధ్ర ప్రదేశ్ – 2047కు రూపకల్పన చేసుకున్నాం. మా మూడు పార్టీలు ఇక్కడున్నాయంటే దానికి కారణం ప్రజలు మాకు అధికారం ఇవ్వడమే. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం. ప్రజలు ఆమోదించి 94 శాతం స్ట్రైక్ రేట్తో గెలిపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క ఏడాదిలో వీలైనంత చేసి చూపించాం” అని చంద్రబాబు అన్నారు.
“ప్రభుత్వం ప్రజాలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతాం. అస్తవ్యస్తం గా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కపెడుతున్నాం. మన ప్రయాణం ఎక్కడ నుంచీ మొదలైందో విశ్లేషించుకోవాలి. అప్పులకు వడ్డీ కట్టి, అసలు కట్టి, సంక్షేమం అందిస్తూ ముందుకు సాగాలంటే అసాధారణంగా పనిచేయాలి.
ఏడాది కాలంలో 31 పాలసీలు అమల్లోకి తీసుకొచ్చాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 82 పథకాలను తిరిగి పునరుద్ధరించాం. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం. మిగిలిన సమస్యలు అధిగమించేలా కార్యాచరణ అమలు చేసుకుందాం” అని అన్నారు.
ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
“ఇప్పటి వరకూ రూ.9.34లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటి ద్వారా 8.50లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూనే ఆటోడ్రైవర్లను ఆదుకునేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. 4 ఏళ్లలో ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల సాకారం చేస్తాం.
ఎన్నికల హామీ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 5సెంట్లు ఇంటి జాగాను వచ్చే 4 ఏళ్లలో కల్పిస్తాం.
ఆగస్టు 15నాటికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 703 సేవలు అందిస్తాం. 15 శాతం వృద్ధిరేటు సాధించేందుకు కలసికట్టుగా కృషి చేద్దాం. స్వర్ణాంధ్ర సాధనకు అంతా పునరంకితమవుదాం. కలసికట్టుగా హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ను సాధిద్దాం” అని చంద్రబాబు అన్నారు.
బనకచర్లపై ఏమన్నారు?
బనకచర్లపై కొనసాగుతున్న వివాదం గురించి చంద్రబాబు నాయుడు స్పందించారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ సమస్య లేదని, ఇది ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుందని అన్నారు. గోదావరి నీటి వినియోగంతో ఇరు తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పారు. మిగులు జలాలను ఏపీ, తెలంగాణ వాడుకోవచ్చని, ఎంత వాడుకున్నా 200 టీఎంసీలు మాత్రమే వాడుకోగలమని అన్నారు.