సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్.. మంత్రి టాన్ సీ లెంగ్‌తో భేటీ.. రికార్డులు సరిచేసేందుకే వచ్చా..

గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్ తో చంద్రబాబు చర్చించారు.

సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్.. మంత్రి టాన్ సీ లెంగ్‌తో భేటీ.. రికార్డులు సరిచేసేందుకే వచ్చా..

CM Chandrababu Naidu

Updated On : July 28, 2025 / 12:04 PM IST

CM Chandrababu Singapore Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు నారా లోకేశ్, నారాయణ, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: తిరుమల శ్రీవారి దర్శనాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక కామెంట్స్.. వాళ్లు ఏడాదిలో ఒకేసారి రావాలి..

గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి టాన్ సీ లాంగ్‌తో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా.. రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని టాన్ సీ లాంగ్‌కు స్పష్టం చేశారు. సింగపూర్‌పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్‌షిప్ నిర్మించామని, సింగపూర్‌ను చూసే హైదరాబాద్‌లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని చంద్రబాబు టాన్ సీ లాంగ్‌కు వివరించారు.

నవంబర్ నెలలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని మంత్రి టాన్ సీ లాంగ్‌ను చంద్రబాబు కోరారు. మానవ వనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని కోరారు. నాలెడ్జి ఎకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్‌లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని చంద్రబాబు కోరారు.

డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సంబంధించిన అంశంలోనూ సింగపూర్ భాగస్వామ్యం అవసరమని చెప్పారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉంది. ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పోర్టులు, లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించటంలో సింగపూర్ సహకరించాలని చంద్రబాబు కోరారు.

గతంలో హైదరాబాద్ వచ్చానని, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశానని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ గుర్తు చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని, అలాగే గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని సింగపూర్ మంత్రి తెలిపారు.