అమరావతి ఉద్యమంపై జగన్ సంచలన కామెంట్స్

అమరావతి ఉద్యమంపై జగన్ సంచలన కామెంట్స్

Updated On : December 17, 2020 / 2:54 PM IST

CM Jagan On Amaravati Lands Insider Trade : అమరావతి రాజధాని అని ముందే నిర్ణయించుకున్నారని, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయించారని సీఎం జగన్ వెల్లడించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి తక్కువ ధరకు భూములు కొన్నారని, భూముల ధరలు పడిపోతాయనే భయంతో ఉద్యమం చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. 2020, డిసెంబర్ 17వ తేదీ గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…ప్రజలను మభ్య పెట్టేందుకు గత ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారో తెలుస్తోందన్నారు.

దిగిపోయిన పాలకుడు..చెడిపోయిన బుర్రతో తాను సొంతంగా లాభ పడేందుకు, బాగు పడేందుకు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి…రైతుల దగ్గరి నుంచి..బినామీలతో తక్కువ ధరకు కొనుగోలు చేయించి..అక్కడే రాజధాని పెట్టాలని ముందే నిర్ణయించి..దాని చుట్టు గుట్టుచప్పుడు కాకుండా..తాను..అతని బినామీల నుంచి కొనుగోలు చేసి..ఈ భూముల రేట్లు ఎక్కడ పడిపోతాయనే ఆందోళనతో కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో..ఉద్యమం చేస్తాననడం చూస్తున్నామన్నారు. చెడిపోయిన బుర్రతో పనిచేస్తే ఎలా ఉంటుందో అక్కడ కనిపిస్తుంది..మంచి బుర్రతో పని చేస్తే ఎలా ఉంటుందో..ఇక్కడ కనిపిస్తుందన్నారు. అణగారిన వర్గాలకు మంచి పని చేసే అవకాశం తనకు ఇచ్చారని తెలిపారు సీఎం జగన్.

అమరావతి రైతులు ఉద్యమం 2020, డిసెంబర్ 17వ తేదీ గురువారంతో ఏడాది పూర్తి చేసుకుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు ఏడాదిగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం రాయపూడిలో జనభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది అమరావతి జేసీ. ఈ సభ వేదికగా రైతులు భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు.