Devineni Uma: కళ్లు బైర్లు కమ్మాయా? పిచ్చి పట్టిందా? అంటూ కొడాలి నానిపై టీడీపీ నేతలు గరం గరం
కొడాలి నానిపై వరుసగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు. కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే రకం కొడాలి నాని అని మండిపడ్డారు.

Devineni Uma Maheswara Rao
Devineni Uma: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. మహిళల్ని తూలనాడే కొడాలి నానిలాంటి వారికి భూమి మీద ఉండే అర్హత లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు కాళ్లపై పడి బీఫామ్ తీసుకున్న విషయం కొడాలినాని మరిచారా? అని నిలదీశారు.
చంద్రబాబు గుడివాడ పర్యటన విజయవంతం కావడంతో కొడాలి నాని కళ్లు బైర్లు కమ్మి, తన రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్థమై పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. గతంలో గుడివాడకు ఎన్నో మంచిపనులు చేసిన చంద్రబాబు చేసిన ఒక్కే ఒక్క చెడ్డ పని కొడాలినాని కి టిక్కెట్ ఇవ్వటమేనని చెప్పారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే రకం కొడాలి నాని అని మండిపడ్డారు. బందరు పోర్టును నవయుగకు ఇచ్చింది వైఎస్ హయాంలో అని కూడా తెలియకుండా కొడాలినాని మాట్లాడుతున్నారని విమర్శించారు.
గుడివాడ టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… అసత్యాలతో గుడివాడ ప్రజల్ని 20 ఏళ్లుగా కొడాలినాని మోసగిస్తూ వస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గుడివాడలో నిర్మించిన 800కు పైగా టిడ్కోఇళ్లు పేదలకు ఇంతవరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
Kodali Nani: జగన్ కంటే చంద్రబాబు ఆస్తులే ఎక్కువ.. నిమ్మకూరుపై వారికే ప్రేముంది..