టీడీపీ Vs వైసీపీ.. ఏపీలో హీటెక్కుతున్న సోషల్ మీడియా వార్..
ఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.

Gossip Garage Social Media War Between Tdp And Ysrcp (Photo Credit : Google)
Gossip Garage : సైకిల్ తగ్గదు. ఫ్యాన్ ఆగదు. ఇద్దరికీ ఆర్మీలు ఉంటాయ్. ఆ ఆర్మీలే వార్ చేస్తాయ్. సోషల్ మీడియాలో పోస్ట్కు పోస్ట్ పెట్టమే కౌంటర్ అయిపోయింది. పార్టీ లీడర్లు కూడా ట్వీట్లు చేస్తూ ప్రత్యర్థిని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా రేపే ఎన్నికలు ఉన్నాయన్నంతగా ఏపీలో సోషల్ మీడియా వార్ పీక్ లెవల్లో కొనసాగుతోంది. అటు టీడీపీ..ఇటు వైసీపీ వరుస పెట్టి..పోటాపోటీ పోస్టర్లు, ట్వీట్లతో బ్లాస్టింగ్ న్యూస్ అంటూ ఉత్కంఠ రేపుతున్నాయి. వైసీపీ టీమ్ చంద్రబాబు, లోకేశ్ను టార్గెట్ చేస్తే టీడీపీ సోషల్ మీడియా..జగన్ను, ఆయన కోటరీని రౌండప్ చేస్తోంది. దీంతో పోటాపోటీ పోస్టులు, ట్వీట్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
రేపే ఎన్నికలు అన్నట్లుగా వార్..
ఎన్నికలు అయిపోయాయి. టీడీపీ పవర్లోకి వచ్చి ఐదు నెలలు కావొస్తోంది. మళ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకో నాలుగేళ్లు అయితే పడుతుంది. కానీ ఏపీలో మాత్రం రేపే ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా టీడీపీ వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా వార్ హీటెక్కుతోంది. పవర్లో ఉన్న టీడీపీ..అపోజిషన్లో ఉన్న వైసీపీ ఎవరూ తగ్గడం లేదు. అధినేత జోలికి వస్తే చాలు ఇచ్చి పడేస్తున్నారు. ఏ చిన్న ఇష్యూ దొరికినా దాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు. నేతలు కూడా ఎక్స్, ఫేస్బుక్ వేదికగానే తమ రియాక్షన్ ఏంటో తెలియజేస్తున్నారు.
బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ రాబోతుందన్న టెన్షన్ సృష్టించారు..
ఎన్నికలకు ముందే ఏపీలో సోషల్ మీడియా వార్ ఓ లెవల్లో జరిగింది. వివేకా హత్యను ప్రస్తావిస్తూ జగన్ను, అవినాశ్ను కార్నర్ చేస్తూ వరుస పోస్ట్లతో హోరెత్తించింది టీడీపీ సోషల్ మీడియా టీమ్. ఇక పవర్లోకి వచ్చాక జగన్ను మరింత ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. లేటెస్ట్గా టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా టీమ్లు పెట్టిన పోస్టర్లు ఉత్కంఠ రేపాయి. అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు ఏపీలో ఏం జరగబోతోంది.? అధికార, ప్రతిపక్షాలు ఏం చెప్పబోతున్నాయన్నట్లుగా ఎక్స్ వార్తో హీట్ క్రియేట్ చేశారు. ఏదో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ రాబోతుందన్న టెన్షన్ సృష్టించారు. టీడీపీ వాళ్లకు సంబంధించిన కుంభకోణం అంటూ వైసీపీ.. జగన్ ఫ్యామిలీ రచ్చ అంటూ టీడీపీ కౌంటర్ ఇచ్చుకున్నాయి.
సోషల్ మీడియాలో పీక్ లెవల్కు విమర్శలు..
వైసీపీ హయాంలో తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీస్లో ఎగ్ పఫ్లకే మూడున్నర కోట్లు ఖర్చు పెట్టారంటూ టీడీపీ.. మొన్నటివరకు కార్నర్ చేసింది. ఆ తర్వాత తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఫర్నీచర్పై కొన్నాళ్లు వార్ నడిచింది. వరద రాజకీయం, సాయంపై కూడా సోషల్ మీడియా వేదికగానే రచ్చ కొనసాగింది. ఇలా ఇష్యూ ఏదైనా ప్రతీ చిన్నదానికి ట్విట్టర్లో పోస్టులతో రాజకీయ మంటలు మండుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో అధికార, విపక్షాల మధ్య విమర్శలు పీక్ లెవల్కు చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు పెట్టుకునే పోస్టులకు హద్దులు కూడా ఉండటం లేదు.
సోషల్ మీడియా ద్వారా ప్రజల మెప్పు పొందే ప్లాన్..
వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియాతోనే ప్రజల మెప్పు పొందే ప్లాన్ చేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు అనుబంధ విభాగాలు ఉండటం కామన్. అయితే సోషల్ మీడియా వింగ్ అంటూ ప్రత్యేక విభాగాన్ని పెట్టుకుంటున్నాయి పార్టీలు. ఆ టీమ్లతోనే ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేయడం, విమర్శలను తిప్పికొట్టడంతో పాటు తాము చేసే పనులను సమర్థించుకుంటూ వార్తలను పోస్ట్ చేస్తుంటారు. ప్రతి పార్టీ ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది. దీంతో ఏది అసలు, ఏది ఫేక్ వార్తనో తెలియని పరిస్థితి ఉంది. ఏదైనా సోషల్ మీడియా సెంట్రిక్గా విమర్శలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
అధికారం దక్కాలన్నా..చేజారాలన్నా సోషల్ మీడియాదే కీరోల్?
రాజకీయం అంటేనే సోషల్ మీడియా వార్గా మారిపోయింది. అబద్ధపు ప్రచారాలు, ఖండనలు.. ఒకటేంటి.. ఏది అసలో? ఏది నకిలీయో తెలియనంతగా పార్టీలు పోస్టులు పెడుతుంటాయి. రాజకీయం నుంచి సోషల్ మీడియాను వేరుచేసి చూడలేని పరిస్థితి వచ్చేసింది. ఒకరకంగా సోషల్ మీడియానే రాజకీయాన్ని నడిపిస్తోందని చెప్పొచ్చు. ఇందులో పైచేయిగా సాధించడానికి ఏపీలోని టీడీపీ, వైసీపీ హోరాహోరీగా పోస్టులు పెడుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపులో ఆ పార్టీ సోషల్ మీడియా కీరోల్ ప్లే చేసింది. దాంతో అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు వైసీపీ తన సోషల్ మీడియాను ఇంకా యాక్టివేట్ చేసింది. ఈ రెండు పార్టీలకు అధికారం దక్కాలన్నా.. చేజారాలన్నా సోషల్ మీడియానే ప్రధాన పాత్ర పోషించే పరిస్థితి వచ్చేసింది.
Also Read : వైసీపీలోనే కొనసాగుతారా? జంప్ అవుతారా? మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దారెటు..