కోత మొదలైంది: మెడికల్ కాలేజీ ఫీజులకు లిమిట్

యథేచ్ఛగా పెంచేసుకునే మెడికల్ కాలేజీ ఫీజులకు ఇకపై లిమిట్స్ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించినట్లుగానే ఫీజులు వసూలు చేయాలి. ఈ మేరకు కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు నిర్వహించే వైద్య కళాశాలలతోపాటు యూజీ, పీజీ డెంటల్, ఆయుష్ కోర్సులు, యూజీ, పీజీ, డిప్లొమో నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ఫీజులను కమిషన్ నిర్ణయం మేరకే వసూలు చేయాలని తెలిపారు.
మూడు విద్యా సంవత్సరాలకు ఫీజులు
ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ వైద్య విద్యా సంస్థలన్నీ ఫిబ్రవరి 27వతేదీ నుంచి 29వ తేదీలోగా ఫీజుల ప్రతిపాదనలను కమిషన్కు సమర్పించాలన్నారు జస్టిస్ ఈశ్వరయ్య. దానిని బట్టి 2020–21, 2021–22, 2022–23 విద్యా సంవత్సరాలకు ఫీజులను కమిషన్ నిర్ణయిస్తుందని వివరించారు.
ఫీజులను ప్రతిపాదించకపోయినా.. దీనిపై స్పందించకపోయినా ఫీజుల వసూలుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. డిగ్రీ, పీజీ కాలేజీల ఫీజులను కూడా ఇకపై కమిషనే నిర్ణయిస్తుందని, వాటికి వచ్చే వారంలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఇంజనీరింగ్, బీఈడీ, ఫార్మా కాలేజీల్లో ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతుందని ఫీజులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
బయోమెట్రిక్, జియో ట్యాగింగ్..:
స్టూడెంట్లకూ షాక్. త్వరలోనే బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురావడంతో పాటు జియో ట్యాగింగ్ ద్వారా ప్రభుత్వ సర్వర్కు అనుసంధానం చేయనున్నట్లు కమిషన్ చైర్మన్ తెలిపారు. యూజీసీ కూడా ఫీజులను ఆయా ప్రాంతాలు, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, కాలేజీల్లో వసతులు, బోధనా ప్రమాణాలు అనుసరించి వేర్వేరుగా ఉండాలని నిర్ణయించారు. నాలుగైదు రెట్లు అధికంగా వసూలు చేస్తున్న ఫీజులను తగ్గించుకోవాలని యాజమాన్యాలకు సూచించామన్నారు.
గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
కొన్ని కాలేజీలు ‘జగనన్న విద్యాదీవెన’ కింద ఇచ్చే రూ.20 వేలు తమకే ఇవ్వాలని విద్యార్ధులపై ఒత్తిడి తెస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి కళాశాలలపై చర్యలు తప్పవని కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలపై grievanceaphermc@gmail. com మెయిల్ ద్వారా కమిషన్కు ఫిర్యాదు చేయాలని కోరారు. 08645 274445 నంబర్కు ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. లెటర్ ద్వారా ‘కమిషన్ కార్యదర్శి, ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్, రెగ్యులేటరీ, మానిటరింగ్ కమిషన్, థర్డ్ ఫ్లోర్, శ్రీమహేంద్ర ఎన్క్లేవ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా’ అడ్రస్కు పంపాలన్నారు.