AP Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో రెండ్రోజులు భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ.. రైతులకు కీలక సూచనలు ..
AP Rain Alert : ఏపీ విపత్తుల నిర్వహణ అథారిటీ (APSDMA) ప్రకారం.. నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన కేంద్రం ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు ద్రోణిగా విస్తరించిందని, దీని ప్రభావంతో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
AP Rain Alert
AP Rain Alert : బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
Also Read : Petrol Price Hike : వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి నుంచే అమల్లోకి..
ఈనెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 48గంటల్లో ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర అల్పపీడనంకు అనుబంధంగా సుమారు 5.8కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీ విపత్తుల నిర్వహణ అథారిటీ (APSDMA) ప్రకారం.. నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన కేంద్రం ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు ద్రోణిగా విస్తరించిందని APSDMA ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశువులు మేపేవారు చెట్ల కింద నిలబడకుండా వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని వారు సూచించారు. విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లోనూ ఉండొద్దని తెలిపారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటలను, ఇప్పటికే కల్లాల్లో ఉన్న పంట ఉత్పత్తులను సంరక్షించుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాలకుతోడు ఏపీలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకే వీధి మండలం, పోలవరం జిల్లాలోని చింతూరు, గంగవరం, కూనవరం, రంపచోడవరంతోపాటు తదితర ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ఎండల తీవ్రత కారణంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేవారు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
