మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో మూడో వ్యక్తి ప్రమేయం…?

New facts in the Madanapalle sisters murder case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యల్లో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రగాడు సుబ్బరామయ్య పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాను వారి ఇంటికి వెళ్లినప్పుడు పూజగదిలో మరో వ్యక్తి కూడా ఉన్నాడని సుబ్బరామయ్య పోలీసులకు చెప్పాడు. ఇంతవరకూ పోలీసులు ఈ కేసులో మరో వ్యక్తి ప్రమేయం లేదని భావిస్తూ వచ్చారు. సుబ్బరామయ్య వాంగ్మూలంతో కేసు తీరు మారిపోయే అవకాశం ఉంది. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలన తర్వాత పోలీసులు మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
మదనపల్లెలో జరిగిన దారుణ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారగా.. మూఢనమ్మకాల ముసుగులో మునిగిన దంపతులే ఇద్దరు కూతుళ్లను దారుణంగా కడతేర్చారు. ఈ జంట హత్యల కేసులో రోజుకొక నమ్మలేని నిజం వెలుగులోకి వస్తోంది. హత్యకు ముందు మల్లూరు పురుషోత్తం నాయుడు, పద్మజ కూతుళ్లు అలేఖ్య, సాయిదివ్య ఇన్స్టాలో చేసిన పోస్టులు అనుమానాలకు తావివ్వగా దానిపై పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.
‘‘వర్క్ ఈజ్ డన్.. శివ ఈజ్ కమింగ్’’ అంటూ వారు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లను గుర్తించగా.. పునర్జన్మలపై విశ్వాసమే దారుణ హత్యలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో పెంపుడు కుక్కపై పురుషోత్తం నాయుడు, భార్య పద్మజల పెద్ద కూతురు అలేఖ్య పునర్జన్మ ప్రయోగాలు చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అక్కాచెల్లెళ్ల హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కుక్కను చంపి మళ్లీ బతికించినట్లుగా అలేఖ్య తల్లిదండ్రులను నమ్మించగా.. అలేఖ్య మాటలు విశ్వసించిన తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయుడు.. చిన్నకుమార్తె సాయి దివ్యపై అదే తరహా ప్రయోగం చేశారు. అలేఖ్య తర్వాత తనను కూడా చంపేయాలని తల్లిదండ్రులకు చెప్పగా.. తర్వాత అలేఖ్యను కూడా తల్లిదండ్రులు చంపేసినట్లుగా తెలుస్తోంది. చిన్నకూతురును మొదటగా చంపి, తర్వాత అలేఖ్యను చంపేసినట్లుగా తెలుస్తోంది.
చనిపోయిన చెల్లి ఆత్మను తిరిగి తెస్తానంటూ తన ప్రాణం తీయాలని అక్క అలేఖ్య తల్లిని కోరగా.. నవధాన్యాలు పోసిన కలసాన్ని ఆలేఖ్య నోట్లో పెట్టి.. ఆమెను తల్లి కిరాతకంగా హతమార్చినట్టుగా చెబుతున్నారు. ఆ సమయంలో భర్త కూడా వారితోనే ఉన్నట్లుగా చెబుతున్నారు.