TPT : కిడ్నాప్ కథ సుఖాంతం, అలిపిరిలో కిడ్నాపైన బాలుడు విజయవాడలో
అలిపిరిలో ఫిబ్రవరి 27న కిడ్నాపైన బాలుడు శివమ్కుమార్ సాహు ఆచూకీ లభించింది.
Alipiri : అలిపిరిలో ఫిబ్రవరి 27న కిడ్నాపైన బాలుడు శివమ్కుమార్ సాహు ఆచూకీ లభించింది. అలిపిరిలో కిడ్నాప్నకు గురైన సాహును…పోలీసులు విజయవాడలో గుర్తించారు. ఐదు బృందాలు సాహూ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించాయి. ఇదే సమయంలో.. విజయవాడ దుర్గ గుడి దగ్గర కిడ్నాపర్లు వదిలి వెళ్లారు.
ఏం జరిగింది ?
అలిపిరిలో ఫిబ్రవరి 27న కిడ్నాపైన బాలుడు శివమ్కుమార్ సాహు ఆచూకీ మిస్టరీగా మారింది. 15 రోజులు కావస్తున్నా చిన్నారి ఎక్కుడుందో తెలియక అటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. చిత్తూరు జిల్లా వీ.కోటకు చెందిన శివప్పే సాహుని కిడ్నాప్ చేశాడని అనుమానిస్తున్నా.. అతడి జాడ కూడా పోలీసులకు తెలియలేదు. ప్రస్తుతం చిన్నారి కర్నాటకలోని ముల్బగల్లో ఉన్నట్లు పోలీసులు తొలుత అనుమానం వ్యక్తం చేశారు. బాలుడి ఆచూకీ కనిపెట్టేందుకు ఐదు ప్రత్యేక టీమ్లు శ్రమించాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కో టీమ్ వెళ్లగా.. చిత్తూరులో 2 బృందాలు గాలింపు చేశాయి.
తిరుపతి అలిపిరిలో కిడ్నాప్కు గురైన ఆరేళ్ల బాలుడు శివకుమార్ను వీ.కోటకు చెందిన ఒక శివప్పే కిడ్నాప్ చేశాడా..? లేక దీని వెనక కిడ్నాప్ ముఠా హస్తం కూడా ఉందా..? అసలు ఆ బాలుడిని ఎక్కడికి తరలించారు..?ఈ అపహరణ వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే దానిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీ.కోటలో పోలీసులు లోతైన విచారణ చేయగా అనేక విషయాలు బయటపడ్డాయి. వీ. కోటలో పిల్లల అపహరణ ముఠాలు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడు ముఠా సభ్యుడా? ఇంకేమైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీ.కోటలో కిడ్నాపర్లు ఎక్కువగా ఉన్నారని తేలడంతో ఈ నెట్వర్క్ మొత్తాన్ని చేధించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.
డబ్బుల కోసం కాకపోతే బాలుడిని అపహరించడం వెనుక కిడ్నాపర్ మోటీవ్ ఏంటనేది పోలీసులకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. పైగా వీ కోట గ్రామంలో కిడ్నాపర్లు ఎక్కువగా ఉన్నారని తేలడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఘటన జరిగి 15 రోజులైనా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. చత్తీస్గఢ్ నుంచి గతనెల 27న శివమ్ కుమార్ సాహు కుటుంబం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లబోతూ ఫుట్పాత్ మీద కాసేపు సేదతీరుతున్న సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు. ఆ సమయంలో వారి పక్కనే పేపర్ చదువుతున్నట్టు నటించిన శివప్ప బాలుడిని కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. మొత్తానికి బాలుడు క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు.