CM Jagan : సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడికేసులో విచారణ వేగవంతం.. మరో 16టీంలు ఏర్పాటు
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడికేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరో 16టీంలను ఏర్పాటు చేసి విచారణలో వేగం పెంచారు.
Stone Attack On CM Jagan : మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా శనివారం విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి జగన్ పై రాయి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను బెజవాడ పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరు టీంలను ఏర్పాటుచేసి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. తాజాగా మరో 16 టీంలను ఏర్పాటు చేసిన పోలీసులు కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Also Read : CM Jagan Bus Yatra : సీఎం జగన్ బస్సు యాత్ర పునఃప్రారంభం.. గుడివాడ వద్ద బహిరంగ సభ
ఒక్కొక్క టీంలో డీసీపీ, ఏడీసీపీ, డీఎస్పీ ర్యాంకు అధికారులను సీపీ నియమించారు. టీంకు అయిదుగురు సభ్యులతో నగరంలో ఉన్న అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను లోతుగా విచారించిన పోలీసులు.. ఓ వ్యక్తిపై పూర్తిగా అనుమానంతో అతనిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ కేసును డీజీపీ, ఇంటిలిజెన్స్ వర్గాల పర్యవేక్షణలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరోవైపు.. రాయిదాడి ఘటన తరువాత విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందిన జగన్ మోహన్ రెడ్డి ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం మేమంతా సిద్ధం బస్సుయాత్రను పునః ప్రారంభించారు. కేసరపల్లి దగ్గర నుంచి ఉదయం 9గంటలకు బస్సుయాత్ర ప్రారంభమైంది. గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల మీదుగా బస్సు యాత్ర సాగనుంది. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 8గంటల సమయానికి కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. రాత్రి నారాయణపురంలో జగన్ బస చేయనున్నారు.
Also Read : జగన్పై జరిగిన దాడి ఘటనపై నివేదిక.. 20 మందితో 6 బృందాలు ఏర్పాటు