చంద్రబాబుకి బెయిల్, టీడీపీ సంబరాలు.. సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్షన్
Sajjala On Chandrababu Bail : చంద్రబాబు బెయిల్, టీడీపీ నేతల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు.

Sajjala On Chandrababu Bail
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి భారీ ఊరట దక్కిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో న్యాయం గెలిచింది అంటూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. జగన్ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు బెయిల్, టీడీపీ నేతల ఆరోపణలకు సజ్జల కౌంటర్ ఇచ్చారు. కోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఇదంతా అబద్దం, కల్పితం అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు సజ్జల.
చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెలువరించింది. చంద్రబాబు తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఆయనకు బెయిల్ ఇచ్చింది. కాగా, ఇదే కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన విషయం విదితమే. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆరోగ్య కారణాలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు విడుదల అయ్యారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన అనంతరం జస్టిస్ టి.మల్లికార్జునరావు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు.
Also Read : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట..
కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, మధ్యంతర బెయిల్ సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయంది. చంద్రబాబు నవంబర్ 29 నుంచి రాజకీయ సభలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ నెల 30న చంద్రబాబు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తన చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించాలంది.
Also Read : యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్టు.. అసలు ఏం జరిగిందంటే?