ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది?: వైఎస్‌ జగన్

హింసా రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని జగన్ అన్నారు.

ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది?: వైఎస్‌ జగన్

Chandrababu Naidu, YS Jagan (Image Credit To Original Source)

Updated On : January 16, 2026 / 3:36 PM IST
  • “మీరు పాలించడానికి అర్హులేనా” అంటూ జగన్ ట్వీట్
  • పిన్నెల్లిలో సాల్మన్‌ మృతి పట్ల జగన్ తీవ్ర ఆవేదన
  • రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను తీస్తారని ప్రశ్న

YS Jagan: “మీరు పాలించడానికి అర్హులేనా” అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. పల్నాడు జిల్లాలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్‌ మృతి పట్ల జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారని ఏపీ సర్కారుని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? అని అన్నారు.

చంద్రబాబు నాయుడి కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మందా సాల్మన్‌ హత్యకు గురయ్యాడని, దీనిక ఏం సమాధానం చెబుతారని జగన్ నిలదీశారు. “అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా? పైగా సాల్మన్‌పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది?” అని అన్నారు.

Also Read: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా.. దేశవ్యాప్తంగా లుంగీలతో ఆ పార్టీ నేతల సంబరాలు.. ఎందుకంటే?

వైసీపీని భయపెట్టడానికి, కట్టడి చేయడానికి మీరు, టీడీపీ వాళ్ల ద్వారా, కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్న, చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే ఈ ఘటన అని జగన్ ఆరోపించారు. “ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మీరు అజమాయిషీ చెలాయిస్తూ, ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్లు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైయస్సార్‌ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు” అని అన్నారు.

హింసా రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని జగన్ అన్నారు. ఇటువంటి ఘటనలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, ఏది విత్తుతారో అదే రేపు పండుతుందన్నదని ఎప్పుడూ మరిచిపోకూడదని చెప్పారు. సాల్మన్‌ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.