విషాదం నింపిన సరదా.. శేషాచలం అడవుల్లోకి వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు శుక్రవారం అన్నమయ్య జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లోకి వెళ్లారు.

BTech students
Seshachalam Forest : విద్యార్థుల సరదా విషాదాన్ని నింపింది. అన్నమయ్య జిల్లాలోని శేషాచలం అడవుల్లోకి ఆరుగురు బీటెక్ విద్యార్థులు వెళ్లారు. వీరంతా గంజనేరు వాటర్ ఫాల్స్ చూసేందుకు సరదాగా వెళ్లారు. అక్కడ స్నానం చేస్తున్న సమయంలో ఓ విద్యార్థి నీటిలో మునిగి మృతిచెందాడు. దీంతో ఆందోళనకు గురైన మిగిలిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో దారితప్పి అడవిలో చిక్కకుపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు రంగంలోకిదిగి వారిని క్షేమంగా అడవిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. మృతిచెందిన విద్యార్థిని సాయిదత్తగా గుర్తించారు. విద్యార్థి మృతదేహాన్ని రైల్వేకోడూరు ఆస్పత్రికి తరలించారు.
Also Read: Gossip Garage : మరోసారి ఒకే ఫ్రేమ్లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్..! ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు అంటే..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు శుక్రవారం అన్నమయ్య జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లోకి వెళ్లారు. వాగేటికోన ప్రాంతంలో గుంజనేరు వాటర్ ఫాల్స్ చూడటానికి విహారయాత్రకు వెళ్లారు. వాటర్ పాల్స్ లో విద్యార్థులు స్నానం చేస్తుండగా సాయిదత్త అనే విద్యార్థి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. ఆందోళనకు గురైన మిగిలిన ఐదుగురు విద్యార్థులు తిరుగు ప్రయాణంలో అడవిలో దారితప్పారు. దీనికితోడు రాత్రి కావడంతో ఆందోళనకు గురయ్యారు. ఫోన్ సిగ్నల్స్ రావడంతో మిత్రులకు సమాచారం అందించారు. మిత్రుల సలహా మేరకు లైవ్ సిగ్నల్స్ లొకేషన్ పంపించారు. వీరంతా అడవిలో తిరుగుతూ చివరకు రైల్వే కోడూరు అటవీ పరిధిలోని ఎస్. ఉప్పరపల్లి, ఎస్. కొత్తపల్లి ప్రాంతాల పరిధిలోకి రాగానే ఫోన్ సిగ్నల్స్ రావడంతో పోలీసులు, అటవీశాఖ అధికారులు అప్రమత్తమై వారి ఆచూకీ గుర్తించేందుకు రంగంలోకి దిగారు.
అటవీ ప్రాంతం పరిధిలోని గ్రామస్తుల సహకారంతో రాత్రివేళ అటవీ ప్రాంతంలో విద్యార్థుల ఆచూకీకోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో రాత్రి 2గంటల సమయంలో వారి ఆచూకీ లభించడంతో వారి వద్దకు వెళ్లి వారిని క్షేమంగా అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇవాళ తెల్లవారు జామున ఉదయం 4గంటల ప్రాంతంలో ఐదుగురు విద్యా ర్థులను రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. మృతిచెందిన సాయిదత్త అనే విద్యార్థి మృతదేహాన్ని రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతి సమాచారాన్ని వారి తల్లిందండ్రులకు అందించారు.