ఓటమి ఖాయమని తెలిసిపోయింది, అందుకే జగన్ మాటల్లో తేడా కనిపిస్తోంది- చంద్రబాబు
వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నా. చక్రవడ్డీతో సహా చెల్లిస్తా. ఓడిపోతామనే భయంతో ఓట్లు మార్చేశారు. దొంగ ఓట్లకు బాధ్యులైన అధికారులను వదిలిపెట్టం.

Chandrababu Naidu
Chandrababu Naidu : రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సీట్లు ఇచ్చినా నేతలు వెళ్లిపోతున్నారని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. అనంతపురము జిల్లా ఉరవకొండ సభలో చంద్రబాబు మాట్లాడారు. తనకు టీవీ, పేపర్ లేదంటూ జగన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. జగన్, ఆయన చెల్లి కొట్టుకుంటే నేను కారణమా? అని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అందరూ నాకు స్టార్ క్యాంపెనర్లే అని చంద్రబాబు అన్నారు. ఎవరినీ వదిలిపెట్టం అని మాస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. మా కార్యకర్తలను బాధపెట్టిన వారిని వదిలిపెట్టం అని చంద్రబాబు హెచ్చరించారు. ఎప్పుడూ పోలీసులకు అండగా ఉంటే పార్టీ మాదే అన్నారు. వైసీపీ గూండాలు జాగ్రత్తగా ఉండాలి, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
Also Read : నిన్న పవన్ కల్యాణ్.. నేడు నాగబాబు.. టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతోంది?
”వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నా. చక్రవడ్డీతో సహా చెల్లిస్తా. ఓడిపోతామనే భయంతో ఓట్లు మార్చేశారు. దొంగ ఓట్లకు బాధ్యులైన అధికారులను వదిలిపెట్టం. మీ భూముల పాస్బుక్లపై జగన్ ఫొటో ఎందుకు? వైపీసీ ప్రభుత్వం తెచ్చింది భూ భక్షణ చట్టం. మేము వచ్చిన వెంటనే భూరక్షణ చట్టాన్ని రద్దు చేస్తాం. అనంతపురం జిల్లాకు రావాల్సిన జాకీ పరిశ్రమ ఏమైంది? కమిషన్లు ఇవ్వలేక అనేక పరిశ్రమలు తరలిపోయాయి.
యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాం. టీడీపీ హయాంలో విండ్, సోలార్ పవర్కు ప్రాధాన్యత ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచి పేదల పొట్ట కొట్టింది. ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేందుకు యువత సిద్ధమయ్యారు. పోయేటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఎవరిని మోసం చేస్తారు? ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా మేం చూశాం. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఫిష్ మార్ట్, వైన్ షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చింది.
ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పరిశ్రమలను తరిమేశారు. పరిశ్రమలు ఉంటే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. మీరు 10 అడుగులు వేయండి. నేను వంద అడుగులు వేస్తా. వైసీపీ పాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటీ లేదు. వైసీపీ పాలనలో తెలుగుజాతి 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. జిల్లాకు నీరు ఇస్తే ఇక్కడ బంగారం పండిస్తారు. జిల్లాలోని ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనేది నా లక్ష్యం. నీళ్లు ఉంటే అనంత జిల్లాతో గోదావరి జిల్లాలు పోటీ పడలేవు. రూ.4,500 కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవా పనులు చేశాం. గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలని అనుకున్నా. గతంలో 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించా. ప్రపంచానికి ఉద్యాన పంటలు అందించే అవకాశం అనంతపురం జిల్లాకే ఉంది.
ఈ సీఎంకు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు కూడా తేడా తెలియదు. ఉరవకొండలో టీడీపీ-జనసేన గాలి వీస్తోంది. ఉరవకొండ సభను చూస్తే జగన్రెడ్డికి నిద్ర పట్టదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లలో గెలుపు మనదే. ఓటమి ఖాయమని తెలిసే జగన్ మాటల్లో తేడా వచ్చింది. హ్యాపీగా దిగిపోతా అని ఇప్పుడే జగన్ అంటున్నారు. రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే ఉంది. ప్రజా వెల్లువ చూస్తేనే తెలుస్తోంది ఎన్నికల్లో ఏం జరుగుతోందో?” అని చంద్రబాబు అన్నారు.
Also Read : నెల్లూరులో కాక.. మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్కు షాక్!
పయ్యావుల కేశవ్ కామెంట్స్..
* అనంతపురం జిల్లాలో ఎగిరేది టీడీపీ, జనసేన జెండాలే
* ఉరవకొండలో అందించిన సేవలకు సంతృప్తిగా ఉంది
* వైసీపీ ప్రభుత్వం బిందుసేద్యాన్ని పక్కన పెట్టింది
* నీళ్లు ఇస్తే రతనాలు పండించగలమని గతంలో రుజువు చేశాం
* రాయలసీమకు నీళ్లు ఇస్తే మా తలరాతలు మారతాయి
* కరవుతో పోరాడిన ధైర్యం సీమ రైతులకు ఉంది
* వైసీపీ పాలనలో ఉరవకొండలో ఒక్క అభివృద్ధి పని జరగలేదు
* టీడీపీ హయాంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేశాం