Cm Chandrababu : రాష్ట్రంలో టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నాం- సీఎం చంద్రబాబు
మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర.

Cm Chandrababu : దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. అభివృద్ధికి సూచికలు, ప్రధాన ఆదాయ వనరులు అని సీఎం చంద్రబాబు అన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో ఈవెంట్ లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎక్స్ పో లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారాయన.
‘ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. కోట్ల మంది భక్తులు ఆలయాలకు విరాళాలు ఇస్తున్నారు. వాటిని పేదల సంక్షేమం, విద్య, వైద్య, ఇతర సేవ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాం. నాడు ఏపీ ఆలయాల్లో ఎన్టీఆర్ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి 2వేల కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ప్రాణాదానం ట్రస్ట్ కు 440 కోట్లు విరాళంగా వచ్చాయి.
Also Read : వంశీ అరెస్ట్.. బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
కుటుంబ వ్యవస్థ మన దేశానికి అతిపెద్ద ఆస్తి, బలం. దేశ, విదేశాలలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు పెరుగుతున్నాయి. ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. 55 కోట్ల మంది కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇవాళ ప్రతి ఇంట్లో ఒక ఏఐ నిపుణుడు తయారు అవుతున్నాడు. టెక్నాలజీ వినియోగంలో మనం మరింత ముందుకెళ్ళాలి.
మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి టెంపుల్ సర్క్యూట్ ను ఏర్పాటు చేస్తున్నాం. అర్చకులకు వేతనాలను పెంచాము. ఆలయాలలో ధూప, దీప, నైవేద్యాలకు ఇచ్చే నగదును పెంచాము. ఏడు నెలల్లో 134 కోట్లు ఆలయాల కోసం ఖర్చు చేశాం. ఆలయాల్లో పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టాం.
తిరుమలలో 75 శాతం పచ్చదనం నెలకొని ఉంది. ఆలయాల్లో సైతం గ్రీన్ ఎనర్జీ వినియోగంలోకి తీసుకుని వస్తాం. దేవుడు సేవ చేయడం అన్నిటికన్నా గొప్పది. దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానిగా మోదీ ఉన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ రాజధానిగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. పక్కవాడికి మోసం చేస్తే ఈ జన్మలోనే కర్మఫలం అనుభవించాలి” అని హెచ్చరించారు చంద్రబాబు.