Terror Links in Vijayawada : విజయవాడలో ఉగ్రవాదుల కలకలం.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు
Terror Links in Vijayawada : విజయవాడలో ఉగ్రలింకులు వెలుగు చూడటం స్థానికంగా కలకలం రేపింది.
terror links exposed in vijayawada counter intelligence officials arrests 3 suspects for anti national activities
Terror Links in Vijayawada : విజయవాడలో ఉగ్రవాద లింకులు వెలుగు చూడటం రాష్ట్రాన్ని ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. ఈ వార్త తెలిసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. విజయవాడ నగరంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ముగ్గురు యువకులు గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికల్లో.. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు పలుకుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరు ఉగ్ర గ్రూపులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తూ.. యువతను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నట్లు సమాచారం అందడంతో.. రంగంలోకి దిగిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు.. మొహ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మొహ్మద్ డానిష్ అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు.. వీరిని ప్రశ్నిస్తున్నారు. ఈ యువకులకు పాకిస్థాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలున్నట్లు అధికారులు గుర్తించారు. విజయవాడ, వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో ఈ ముగ్గురు యువకులకు పరిచయం ఏర్పడింది. వీరు సోషల్ మీడియా వేదికగా.. దేశ వ్యతిరేక పోస్టులు చేస్తూ.. వివిధ ప్రాంతాల్లో యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరిపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
అదుపులోకి తీసుకున్న యువకుల వద్ద నుంచి ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, కొన్ని అనుమానాస్పద పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల మొబైల్ ఫోన్లలో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా.. వీరికి ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నాయి.. నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనే విషయాలను ఆరా తీస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు సాగిన ప్రాథమిక విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. విజయవాడలో ఉగ్ర లింకులు వెలుగు చూడటంతో.. నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
