Yarlagadda Venkata Rao: యార్లగడ్డ వెంకట్రావు సంచలన నిర్ణయం.. వైసీపీకి గుడ్ బై చెప్పి, చంద్రబాబు వద్దకు..
పార్టీలో ఉంటే ఉండు.. పోతే పొమ్మని సజ్జల చెప్పడంతో తనకు చాలా బాధ, ఆవేదన కలిగాయని అన్నారు.
![Yarlagadda Venkata Rao: యార్లగడ్డ వెంకట్రావు సంచలన నిర్ణయం.. వైసీపీకి గుడ్ బై చెప్పి, చంద్రబాబు వద్దకు.. Yarlagadda Venkata Rao: యార్లగడ్డ వెంకట్రావు సంచలన నిర్ణయం.. వైసీపీకి గుడ్ బై చెప్పి, చంద్రబాబు వద్దకు..](https://10tv.in/wp-content/uploads/2023/08/New-Project-2023-08-18T150546.219.jpg)
Yarlagadda Venkata Rao
Yarlagadda Venkata Rao: వైసీపీ (YCP) గన్నవరం (Gannavaram) కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైసీపీ శ్రేణులకు తాను క్షమాపణ చెబుతున్నానని వ్యాఖ్యానించారు.
తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని వాపోయారు. గన్నవరంలో వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానని అన్నారు. సీఎం జగన్ ను టిక్కెట్ ఇవ్వాలని మాత్రమే అడిగానని తెలిపారు. పార్టీ పెద్దలకు ఏం అర్థమైందో ఏమో తనకు తెలియలేదని అన్నారు. తనను ఎక్కడైనా పార్టీ సర్దుబాటు చేస్తుందని సజ్జల ప్రకటన చేస్తే బాగుండేదని చెప్పారు.
పార్టీలో ఉంటే ఉండు.. పోతే పొమ్మని సజ్జల చెప్పడంతో తనకు చాలా బాధ, ఆవేదన కలిగాయని అన్నారు. టీడీపీ కంచుకోటలో తాను ఢీ అంటే ఢీ అని పోరాడానని తెలిపారు. తన బలమే ఇప్పుడు బలహీనత అయిందా? అని అన్నారు. టీడీపీలో గెలిచిన అభ్యర్థిని తెచ్చుకోవడం మీకు బలంగా మారిందా అని ప్రశ్నించారు. మూడేళ్లుగా తనకు ఏ ప్రత్యామ్నాయం చూపించలేదని అన్నారు.
తడిగుడ్డతో గొంతు కోయడం అనేది తన విషయంలో నిజమైందని చెప్పారు. నమ్మిన మనిషిని కాపాడాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుందని అన్నారు. తాను ఇంతవరకు చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ నేతలను కలవలేదని చెప్పారు. తాను టీడీపీ నేతలను కలిసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాలు విసిరారు. ఇప్పుడు చంద్రబాబును కలవబోతున్నానని యార్లగడ్డ ప్రకటించారు.