Marri Rajasekhar: వైసీపీకి మరో బిగ్ షాక్ .. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా
శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.

Marri Rajasekhar
Marri Rajasekhar Resigns: శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ లు ఉన్నారు. తాజాగా.. మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీకి బిగ్ షాక్ తగిలినట్లయింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మర్రి రాజశేఖర్ ఆ పార్టీలో కొనసాగుతున్నారు. 2014లో రాజశేఖర్ కు చిలకలూరిపేట టికెట్ ఇవ్వగా టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావుపై ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన స్థానంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విడుదల రజని వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అయితే, ఆ సమయంలో టికెట్ ఇవ్వనికారణంగా అసంతృప్తిగా ఉన్న రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో మర్రి రాజశేఖర్ కీలక నేతగా ఉన్నారు. అయితే, రాజశేఖర్ పార్టీని వీడి వెళ్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ప్రచారం జరుగుతున్నట్లుగానే ఆయన తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, ఆయన టీడీపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.