రూ.1 కే చికెన్ బిర్యానీ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు అన్ని వ్యాపారాలు కుదేలైపోతున్నాయి. వ్యాపారస్తులు కోట్లలో నష్టాలు చవి చూస్తున్నారు. ఇది పౌల్ట్రీ రంగానికి తాకింది. ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ బ్రాయిలర్ కోళ్ల ద్వారా వ్యాపిస్తుందంటూ సోషల్ మీడి యా లో వస్తున్న వార్తలతో కోళ్ల విక్రయాలు దారుణంగా పడిపోయాయి. అలాగే, ప్రజలు చికెన్ బిర్యానీ కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో హోటల్ యజమానులు చికెన్ బిర్యానీ కొంటే చికెన్-65 ఉచితమంటూ ప్రకటిస్తున్నారు.
తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పొన్నేరిలో కొత్తగా ప్రారంభించిన ఒక హోటల్ లో రూ.1కే చికెన్ బిర్యానీ అమ్మటం మొదలెట్టారు హోటల్ యజమానులు. ప్రారంభోత్సవ కానుకగా ప్రజలకు రూ.1కే చికెన్ బిర్యానీ అందిస్తున్నట్లు బోర్డులు పెట్టడంతో ప్రజల బారులు తీరారు. ప్రజలు బిర్యానీ కోసం బారులు తీరడంతో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు.
తొలిరోజు మధ్యాహ్నం 12గంటలకు విక్రయాలు ప్రారంభించగా రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ అయిపోయింది. ఈ విషయమై హోటల్ యజమాని మాట్లాడుతూ కొత్తగా హోటల్ ప్రారంభించామని, కరోనా వైరస్ భయంతో చికెన్ బిర్యానీ అమ్ముడవుతుందా…. కాదా అనే సందేహం కలిగిందన్నారు. దీంతో రూ.1కే అని ప్రకటించిన రెండు గంటల్లోనే బిర్యానీ విక్రయమైందని ఆయన తెలిపారు.
See Also | కోడి మాంసం తింటే కరోనా రాదు