కరోనా దెబ్బకు దలాల్ స్ట్రీట్ ఢమాల్

కరోనా దెబ్బకు దలాల్ స్ట్రీట్ ఢమాల్

New Project (4)

Updated On : August 5, 2021 / 4:40 PM IST

కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మార్చి-12,2020)మరో బ్లాక్ డే నమోదైంది. కరోనా వైరస్,  చమురు ధరల పతనం ప్రభావంతో దేశీయ స్టాక్​ మార్కెట్లు ఎప్పుడూ లేనంతగా కుదేలయ్యాయి. అన్ని దిక్కుల నుంచి సమస్యలు దాడి చేసిన నేపథ్యంలో మార్కెట్లకు కోలుకునే అవకాశమే దక్కలేదు.

కరోనా (కోవిడ్-19)మహమ్మారిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించడంతో ఇవాళ మార్కెట్లు ప్రారంభం నుంచి ముగిసేవరకు నష్టపోవడం మాత్రమే తెలిసిన రీతిలో షేర్లు కదిలాడాయి. మార్కెట్లు ముగిసే నాటికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి(BSE) సెన్సెక్స్​ 2,919 పాయింట్లు పతనమై 32,778 పాయింట్లకు దిగజారింది. 868 పాయింట్లు పడిపోయిన జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి(NSE)నిఫ్టీ 9,590 పాయింట్లకు చేరింది.

ఓపెనింగ్ నుంచే నష్టాలపాలవుతూ వచ్చిన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. నిఫ్టీ 10 వేల దిగువకు పడిపోవటం 2018 మార్చి 26 తర్వాత ఇదే తొలిసారి. నిఫ్టీ బ్యాంకు సూచీ 10 శాతం పడిపోయి 17 నెలల కనిష్ఠానికి చేరింది. బీఎస్​ఈ మిడ్​క్యాప్​ సూచీ 38 నెలల కనిష్ఠానికి పడిపోయింది. భారీ నష్టాల్లో…అన్ని రంగాల సూచీలపై బేర్ ఆధిపత్యం సాధించింది. ఓఎన్​జీసీ, ఎస్బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, ఐటీసీ, బజాజ్​ ఆటో, టీసీఎస్​ నష్టాల కోసం పోటీ పడ్డట్టుగా అనిపించాయి. చమురు ధరలు పడిపోయిన నేపథ్యంలో రిలయన్స్​, ఓఎన్​జీసీ షేర్లు భారీగా పతనమయ్యాయి.

మార్కెట్లు ఎంతగా పతనమయ్యాయంటే..783కంపెనీలు తమ 52వారాల అత్యల్ప స్థాయిలో ట్రేడ్ అయ్యాయి.  30 షేర్ ఇండెక్స్​లో ఇవి కీలక షేర్లు కావటం వల్ల మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపెట్టాయి. దిగ్గజ సంస్థల షేర్లలో చాలా వరకు 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి.

ఐరోపాలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. బ్రిటన్​ మినహా ఐరోపా దేశాలన్నింటికీ 30 రోజుల పాటు ప్రయాణాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. జర్మనీలో 70 శాతం మంది ప్రజలకు కరోనా సోకవచ్చని ఆ దేశ ఛాన్స్​లర్​ ఎంజెలా మెర్కెల్​ ప్రకటించడం కూడా మదుపరులను భయాందోళనలకు గురిచేసింది. కరోనా వైరస్​ను అంతర్జాతీయ మహమ్మారిగా డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించిన తర్వాత ఆసియా మార్కెట్లు భారీగా పడిపోయాయి. ట్రంప్ చేసిన ప్రసంగం అనంతరం మరింత దిగజారాయి.